అల్లవరం: ప్రజాసేవల పంపిణీ, పారదర్శక పాలన, రికార్డుల నిర్వహణ, పౌరుల సంతృప్తి తదితర అంశాలపై జరిగిన ఆడిట్లో ప్రపంచ నాణ్యాతా ప్రమాణాలు పాటిస్తున్న పంచాయతీగా కొమరగిరిపట్నం పంచాయతీ ఎంపికయింది. కేరళకు చెందిన ప్రేమానంద్, సలీమ్ కెమ్, రాష్ట్ర పంచాయతీరాజ్ కోఆర్డినేటర్ ఇమామ్లతో కూడిన బృందం మూడురోజుల పాటు ఆడిట్ నిర్వహించింది. గ్రామ పంచాయతీలో అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం గురువారం జరిగిన సమావేశంలో ఐఎస్ఓ డ్రాప్ట్ సర్టిఫికెట్ను సర్పంచ్ రాకాపు విజయలక్ష్మికి బృందం సభ్యులు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 24 పంచాయతీలను ఐఎస్ఓ సర్టిఫికెట్కు ఎంపిక చేయగా తొలిదశలో కొమరగిరిపట్నం పంచాయతీ ఐఎస్ఓ డ్రాఫ్ట్ గుర్తింపు పొందిందన్నారు. కొమరగిరిపట్నంలో పంచాయతీలో అందిస్తున్న సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎంపీడీఓ గౌరికుమారి, డిప్యూటీ ఎంపీడీఓ యు.నాగేంద్ర, ఎంపీటీసీ సభ్యులు మామిడిశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శి చిక్కం శ్రీను, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


