
‘నన్నయ’లో 14 నుంచి ఫుడ్ ఫెస్టివల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే మెగా ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 14న ప్రారంభమవుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆమె శుక్రవారం విడుదల చేశారు. అక్టోబరు 16 ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని, గోదావరి రుచులు, అభిరుచులను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. ఆహార పదార్థాల తయారీలో చేయి తిరిగిన ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభ చాటాలన్నారు. వివరాలకు 8639 550 186 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయనిర్మల, హెచ్ఓడీ ఆచార్య డి.కల్యాణి, అధ్యాపకులు ఎంఎం కృష్ణవేణి, కె.సింధుజ పాల్గొన్నారు.