
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను రథంపై మూడుసార్లు ఊరేగించారు.