అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Jul 18 2025 1:16 PM | Updated on Jul 18 2025 1:16 PM

అధ్యా

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

కొత్తపేట: జిల్లాలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తులు కోరుతున్నట్టు స్థానిక వీకేవీ ప్రభుత్వ ఐడెంటిఫైడ్‌ (ఐడీ) డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేపీ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం జోన్‌ – 2, జిల్లా పరిధిలోని 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికి ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకుల రెన్యువల్‌కు ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్‌కు దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ఆ దరఖాస్తులను 20వ తేదీన కొత్తపేట ఐడీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు సమర్పించాలని తెలిపారు. 21 నుంచి 23 తేదీ లోపు రెన్యువల్‌ కోసం జిల్లా సెలక్షన్‌ కమిటీ సమక్షంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి వుంటుందని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి రెన్యువల్‌ అయిన ఒప్పంద అధ్యాపకులు కౌన్సిలింగ్‌ ముగిసిన తరువాత రోజు అగ్రిమెంట్‌ పత్రాలను కళాశాల ప్రిన్సిపాల్స్‌కు అందచేసి, అగ్రిమెంట్‌ చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ తెలిపారు.

బంగారు కుటుంబాలను

ఆదుకోవాలి

ధనవంతులకు కలెక్టర్‌ పిలుపు

అమలాపురం రూరల్‌: పేదరికం లేని సమాజం కోసం జిల్లాలో 64 వేల బంగారు కుటుంబాల పేదలను పైకి తీసుకువచ్చేందుకు ధనవంతులు ముందుకు రావాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. గురువారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి స్వర్ణాంధ్ర, పీ–4 తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి బంగారు కుటుంబాలకు మద్దతుగా నిలవాలన్నారు. జిల్లాలో ఇంత వరకు 64 వేల మంది బంగారు కుటుంబాలను గుర్తించామని, వారికి మార్గదర్శకులు అండగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం ద్వారా పరిశ్రమల స్థాపనకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌

పునరుద్ధరించాలి

కేంద్ర మంత్రికి కేఆర్‌ఎస్‌ఎస్‌ బృందం వినతి

అమలాపురం టౌన్‌: పట్టణంలోని మున్సిపల్‌ సర్క్యులర్‌ బజార్‌ (షాపింగ్‌ కాంపెక్స్‌)లో గతంలో కొనసాగినట్లే రైల్వే టిక్కెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌ను పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు కోనసీమ రైల్వే సాధన నమితి (కేఆర్‌ఎస్‌ఎస్‌) ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేసింది. రాజోలులోని నూతన పోస్ట్‌ ఆఫీస్‌ భవనాన్ని ప్రారంభించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన కేంద్ర మంత్రిని ఆ బృందం కలిసి రైల్వే కౌంటర్‌ పునరుద్ధరణపై చర్చించింది. అమలాపురంలో రిజర్వేషన్‌ కౌంటర్‌ను 2023లో మూసివేశారని వారు వివరించారు. కేఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కూడా కేంద్ర మంత్రికి అమలాపురంలో రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ను మున్సిపల్‌ షాపుల్లోంచి ఎత్తివేసిన తర్వాత కోనసీమ ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కేఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఈఆర్‌ సుబ్రహ్మణ్యం, కేఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, ఉప్పుగంటి భాస్కరరావు, పోలిశెట్టి శివాజీ, ఎరగర్త వెంకటేశ్వరరావు తదితరులు కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన వారలో ఉన్నారు.

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం 1
1/2

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం 2
2/2

అధ్యాపకుల రెన్యువల్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement