
లోకేష్కు డప్పు కొట్టడానికే మహానాడు
రావులపాలెం: నారా లోకేష్కు డప్పు కొట్టడానికే టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కడపలో నిర్వహించిన మహానాడులో కూటమి ప్రభుత్వం గొప్పదనాన్ని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి భ్రమరావతిని అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్వప్రయోజనాలను కాపాడుకోవడానికే చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని జనమే చెప్పుకుంటున్నారన్నారు. లోకేష్ను జాకీలతోనైనా పైకి లేపాలనే తాపత్రయంతో మహానాడు నిర్వహించినట్టుందన్నారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలనుకుంటున్నారని, కానీ ఆయన కలెక్టింగ్ ప్రెసిడెంట్గా బాగా సూట్ అవుతారని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని కూటమి ప్రభుత్వం మోపిందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్ రాజు, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకుడు గొలుగూరి మునిరెడ్డి, ముసునూరి వెంకటేశ్వరరావు, మండల శాఖల అధ్యక్షులు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిలో కూటమి ప్రభుత్వం
చేసిందేమీ లేదు
స్వప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి