
శ్రీనివాసా.. శ్రీవేంకటేశా..
పోగొట్టుకున్న ఉంగరం భక్తుడికి అందజేత
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి, స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. అనేక మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించారు. శ్రీనివాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యాన అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. అభిషేకాలు, అర్చనల అనంతరం రంగురంగుల సుగంధభరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈఓ చక్రధరరావు ఆధ్వర్యాన అధికారులు, సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ వేలాదిగా వచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.52,15,096 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యాన ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము, వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు నడిపింది.
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న క్షేత్రంలో ఒక భక్తుడు పోగొట్టుకున్న బంగారు ఉంగరాన్ని దేవస్థానం అధికారులు భద్రపరిచి ఆ భక్తునికి తిరిగి అప్పగించారు. ఈ క్షేత్రానికి ప్రతి శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గత శనివారం విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన సుదర్శనరెడ్డి సుమారు రూ.లక్ష విలువ చేసే బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు. తిరిగి ఇంటికి వెళ్లాక చూసుకుంటే ఉంగరం కనిపించలేదు. ఎక్కడో పడిపోయి ఉంటుందని భావించారు. అయితే ఆ ఉంగరం దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ వై.శ్రీనుకు దొరకగా ఆ విషయాన్ని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు దృష్టికి తీసుకువెళ్లి ఆయన సూచనల మేరకు భద్రపరిచారు. కాగా ఈ శనివారం మళ్లీ వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఆ భక్తుడు సుదర్శనరెడ్డి దేవస్థానం వారిని సంప్రదించారు. ఆయన చెప్పిన ఆధారాలు పరిశీలించి, ఆ ఉంగరం ఆ భక్తునిదేనని నిర్ధారించుకుని శ్రీను చేతుల మీదుగానే ఆ ఉంగరాన్ని భక్తునికి తిరిగి అప్పగించారు. దానితో ఆ భక్తుని ఆనందానికి అవధులు లేవు. పోయిందనుకున్న ఉంగరం తిరిగి తనకు చేరడం ఆ వేంకటేశ్వరస్వామి కృపా కటాక్షమేనని అన్నారు. దేవస్థానం ఈఓ చక్రధరరావుకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం అన్నమాచార్య సంకీర్తనాచార్యులు కరుటూరి వెంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాసా.. శ్రీవేంకటేశా..