
రేపటి నుంచి సత్యసాయి రథోత్సవం
కొత్తపేట: భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా సత్యసాయి ప్రేమ ప్రవాహిని (రథోత్సవం) ఈ నెల 3 డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రవేశించి ఈ నెల 6 వ తేదీ వరకూ కొనసాగుతుందని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధి, జిల్లా సేవాదళ్ కన్వీనర్ మన్యం పర్వతవర్ధనరావు తెలిపారు. రథోత్సవం నిర్వహణపై ఆదివారం స్థానిక సత్యసాయి సేవా మందిరంలో సేవా సమితి ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కన్వీనర్ కంకటాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వర్ధనరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సత్యసాయి సేవా సంస్థలు 150 దేశాలలో విస్తరించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలో రథోత్సవం ఇలా..
మంగళవారం ఉదయం యానాంలో రథోత్సవం ప్రారంభమై ఎదుర్లంక బాలయోగి వారథి మీదుగా మురమళ్ల, ముమ్మిడివరం, అమలాపురం, బండార్లంక, పి.గన్నవరం, డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ మీదుగా సాయంత్రానికి వాడ్రేవుపల్లి చేరుకుంటుంది. 4న ఉదయం అక్కడ బయలుదేరి పెదపట్నం అగ్రహారం, మామిడికుదురు, మగటపల్లి, గోగన్నమఠం, శంకరగుప్తం, అంతర్వేది, సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, జగ్గన్నపేట మీదుగా సాయంత్రానికి లక్కవరం చేరుకుంటుంది. 5వ తేదీ ఉదయం కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం నుంచి కొత్తపేట, రావులపాలెం, ఊబలంక, ఆలమూరు మీదుగా సాయంత్రానికి మండపేట చేరుకుంటుంది. 6న వల్లూరు వెదురుమూడి, అంగర, పామర్రు, ద్రాక్షారామం, చెల్లూరు, పసలపూడి, రామచంద్రపురం మీదుగా కేశవరంతో జిల్లాలో రథోత్సవం ముగుస్తుంది. సమావేశంలో సేవా సమితి సభ్యులు చొప్పెల్ల రాంబాబు, సత్యవరపు భాస్కరరావు పాల్గొన్నారు.