
కాపులపై కేసులను తిరగతోడడం కక్ష సాధింపే
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: కాపులపై కోర్టు కొట్టేసిన కేసులను ఇప్పుడు తిరగతోడడం అంటే కేవలం కక్ష సాధింపు అని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై ఉన్న ద్వేషంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీస్తోందని స్పష్టం చేశారు. అమలాపురం హైస్కూలు సెంటరులో గల తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా రిజర్వేషన్ల కోసం ముద్రగడతోపాటు అనేకమంది కాపు నాయకులు ఉద్యమించారని గుర్తు చేశారు. కేవలం ముద్రగడపై కక్ష సాధింపు కోసం కేసులను తిరగతోడే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వం అందుకు ప్రతికూల ఫలితం పొందక తప్పదని ఆయన స్పష్టం చేశారు. 2023లో కాపులపై కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తే ఇప్పడు ఈ కేసులపై హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక కక్ష సాధింపు అనే కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ అన్నారు. ముద్రగడ కాపుల కోసం చేసిన ఉద్యమాలన్నీ గాంధేయ మార్గంలోనే చేశారని, ఆయనపై చంద్రబాబు ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడమే పెద్ద తప్పు అయితే ఇప్పుడు కోర్టు కొట్టేసిన కేసులను తిరగతోడాలనుకోవడం మరో అతి పెద్ద తప్పు అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులు, శెట్టిబలిజల మైత్రీ బంధం బలంతో టీడీపీకి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
మార్పులపై దృష్టి సారించాలి
అమలాపురం టౌన్: నూతన విద్యా సంవత్సరంలో అమలవుతున్న మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి ఆ దిశగా బోధన చేయాలని డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా ఉపాధ్యాయులకు సూచించారు. అమలాపురంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన జిల్లా రిసోర్స్ పర్సన్ల శిక్షణ కార్యక్రమంలో డీఈవో బాషా ప్రసంగించారు. జిల్లా విద్యా శాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో సెకండరీ స్థాయి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు నియమితులైన జిల్లా రిసోర్స్ పర్సన్లకు మూడు రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ఈ పాఠశాలలో ఏర్పాట్లు చేసినట్లు డీఈవో బాషా తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అదనపు కో ఆర్డినేటర్ జి.మమ్మీ ప్రారంభించారని చెప్పారు. విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్సర్ బుక్స్, పరీక్షా విధానంలో చోటు చేసుకున్న మార్పులు, తరగతి గది బోధనలో వినియోగించే టీచ్ టూల్స్, అబ్జర్వేషన్ పద్ధతులు, నూతన అకడమిక్ క్యాలెండర్ తదితర అంశాలపై ఈ శిక్షణ ఉంటుందని డీఈవో స్పష్టం చేశారు.
శ్రీరామ నామ సప్తాహం నిర్వహణకు రూ.1.50 లక్షల విరాళం
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద ఈ నెల 2 నుంచి జూలై 21 వరకు 49 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీరామ నామ సప్త సప్తాహ మహోత్సవం నిర్వహణకు ద్రాక్షారామకు చెందిన చెరుకు వీరభద్రరావు రూ.1,50,000 విరాళంగా తన కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు. కార్యక్రమంలో ప్రసన్నాంజనేయ బాలభక్త సమాజం అధ్యక్షుడు బోణం శ్రీను, కై రం వీరవెంకటసత్యనారాయణ(సతార్ స్వామి), చెరుకు బాబూరావు, సలాది బ్రహ్మానందం పాల్గొన్నారు.

కాపులపై కేసులను తిరగతోడడం కక్ష సాధింపే

కాపులపై కేసులను తిరగతోడడం కక్ష సాధింపే