
వెన్నుపోటుపై కన్నెర్ర
సాక్షి, అమలాపురం: కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పాలనా కాలంలో సంక్షేమం పథకాల అమలు విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి... ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేయడానికి నిరసనగా బుధవారం వైఎస్సార్ సీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలు జిల్లా వ్యాప్తంగా హోరెత్తాయి. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మోసం, దగాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, జనం ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అమలాపురంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ల ఆధ్వర్యంలో జరిగింది. భట్నవిల్లిలోని విశ్వరూప్ ఇంటి వద్ద నుంచి బైక్ ర్యాలీ మొదలై నల్లవంతెన, ఎర్ర వంతెన మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అనంతరం డీఆర్వో రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కూడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.
పి.గన్నవరంలో వైఎస్సార్ సీపీ నియోకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పి.గన్నవరం అక్విడెక్టు నుంచి మూడు రోడ్ల సెంటర్ మీదుగా వెన్నుపోటు ర్యాలీ సాగింది. వైఎస్సాఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సత్యానారాయణకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.
రాజోలులో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. మలికిపురంలో నల్లి కామేశ్వరరావు ఇంటి వద్ద ఉన్న పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ ప్రారంభమైంది.
ప్రధాన కూడలి మీదుగా సెంటర్కు వచ్చి అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ సాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు.
కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. కోనసీమ ముఖద్వారం వద్ద ఉన్న పార్టీ కార్యాలయం వద్దకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రావణాసురుని ఆకృతిలో తయారు చేసిన చంద్రబాబు చిత్రపటానికి పది తలలు పెట్టారు. వాటిపై సూపర్ సిక్స్ పథకాల పేర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్, చిర్ల సోమసుందర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆఫీసు నుంచి జెండాలు, ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కళా వెంకట్రావు సెంటర్ నుంచి బలరామిరెడ్డి ఆసుపత్రి జంక్షన్ మీదుగా యూటర్న్ తీసుకుని తిరిగి కళా వెంకట్రావు సెంటర్కు చేరుకుని, అక్కడ నుంచి రింగ్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ముక్తేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. జగ్గిరెడ్డి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ప్రసంగించారు.
మండపేటలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట తిమూర్తులు ఆధ్వర్యం వహించారు. పట్టణంలోని విజయలక్ష్మీనగర్లోని పార్టీ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజారత్న సెంటర్ వద్ద దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి బస్స్టాండ్ మీదుగా కలువపువ్వు సెంటర్ వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్లు నేతృత్వం వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మెయిన్రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో అఖిలకు వినతి పత్రం అందించారు.
కూటమి ప్రభుత్వ తీరుపై...
గళమెత్తిన వైఎస్సార్ సీపీ
కోనసీమలో ‘వెన్నుపోటు దినం’
ఏడు నియోజకవర్గాలలో
కదం తొక్కిన పార్టీ శ్రేణులు
కూటమి ఏడాది పాలనపై
వెల్లువెత్తిన నిరసన
పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీలు,
మాజీ ఎమ్మెల్యేలు
రావులపాలెంలో పాల్గొన్న
పార్టీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి
పలుచోట్ల మోటార్ సైకిళ్ల ర్యాలీలు
రెవెన్యూ అధికారులకు
విజ్ఞాపన పత్రాల అందజేత
ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలమ్మ చెరువు అంబేడ్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ జరిగింది. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు.