
ఇంటింటికీ రేషన్ రద్దు అమానుషం
అల్లవరం: అధ్వాన విధానాలతో కూటమి ప్రభుత్వం ప్రజలను అష్టకష్టాలు పెడుతోందని మాజీ ఎంపీ చింతా అనురాధ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇంటింటికీ రేషన్ పథకం ద్వారా లబ్ధిదారుల చెంతకే నాణ్యమైన సరకులు పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు రద్దు చేయడం చాలా అమానుషమని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థలను అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటింటికీ రేషన్ పథకం రద్దు ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన 20 వేల మంది ఎండీయూ ఆపరేటర్ల పొట్టగొట్టారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా చంద్రబాబు మోసం చేస్తున్నారని అనురాధ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఇంటింటికీ రేషన్ పథకాన్ని రద్దు చేయడం ఆయన పాలానా వైఫల్యానికి నిదర్శమని అన్నారు. చంద్రబాబు నిర్ణయంతో వందలాది మంది కార్డుదారులు రేషన్ డిపోల వద్ద గంటల తరబడి నిలబడే పరిస్థితి మళ్లీ మొదలైందన్నారు. ఇంటి వద్దకే అందుతున్న సేవలపై ఎందుకు అంత కక్షని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిందచాల్సిన ప్రభుత్వమే, ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని ఆక్షేపించారు. ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇంటింటికీ రేషన్ పథకాన్ని పునఃప్రారంభించాలని అనురాధ డిమాండ్ చేశారు.
మాజీ ఎంపీ చింతా అనురాధ