
బాబు ష్యూరిటీ.. లేదు గ్యారెంటీ..
ఫ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గడచిన ఏడాది కాలంలో మహిళలకు ఎటువంటి సంక్షేమమూ అందకుండా పోయింది. అమ్మ ఒడి పథకాన్ని ‘తల్లికి వందనం’గా పేరు మార్చినప్పటికీ అమలు చేయలేదు. గత విద్యా సంవత్సరం దాదాపుగా 1.45 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల వంతున సుమారు రూ.217.50 కోట్లు జమ చేయాల్సి ఉండగా పూర్తిగా ఎగ్గొట్టేశారు.
ఫ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చింది. కూటమి సూపర్ సిక్స్ పథకంలో ఇది ప్రముఖమైనదిగా ఎన్నికల సభల్లో చంద్రబాబు గొప్పగా చెప్పుకునేవారు. అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకూ నయా పైసా కూడా ఇవ్వలేదు. ఈ పథకానికి జిల్లాలో కనీసం 4.50 లక్షల మంది అర్హులున్నట్లు అంచనా. నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి వీరికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈవిధంగా ఏడాది కాలంలో జిల్లాలోని మహిళలకు కూటమి ప్రభుత్వం రూ.810 కోట్లు ఎగ్గొట్టింది.
ఫ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా టీడీపీ సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. ఏడాది గడుస్తున్నా దీని అమలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. తాజాగా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెబుతోంది. అయితే, ఏడాది కాలంగా ఇంకా విధివిధానాల రూపకల్పనలోనే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతూండటం గమనార్హం. ఉచిత ఆర్టీసీ ప్రయాణం ద్వారా జిల్లాలోని సుమారు 9 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉంది.
ఫ జిల్లాలో 3.90 లక్షల మంది వరకూ గ్యాస్ వినియోగదారులున్నారు. వీరికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉండగా, గత ఏడాది ఒక్కటి మాత్రమే ఇచ్చారు. అది కూడా సగం మందికేననే విమర్శలున్నాయి. తరువాత మరో ఉచిత సిలిండర్ ఇచ్చిన దాఖలాలు లేవు.