
డీఎస్సీ తొలిరోజు పరీక్షకు 38 మంది గైర్హాజరు
అమలాపురం రూరల్: మండలంలోని భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. కళాశాలలో నిర్వహించిన మొదటి సేషన్ డీఎస్సీ పరీక్షకు 18 మంది గైర్హాజరయ్యారని పరీక్షల సూపరింటెండెంట్ అడబాల కుమార్ తెలిపారు. అలాగే కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన మొదటి సెషన్ డీఎస్సీ పరీక్షకు 20 మంది గైర్హాజరయ్యారని డీఈవో షేక్ సలీం బాషా తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఆయన తెలిపారు.
15 ఎకరాల్లో సరుగుడు తోట దగ్ధం
రూ.50 లక్షలకు పైగా నష్టం
మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో సరుగుడు తోటలు దగ్ధమయ్యాయి. సుమారు 15 ఎకరాల్లోని తోటలు దగ్ధమైనట్టు మాజీ సర్పంచ్ ఆకుల చిన వెంకన్నాయుడు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగిందన్నారు. ఎండల ధాటికి ఇలా జరిగిందని, మంటలు ఎలా రేగాయన్నది తెలియదని ఆయన తెలిపారు. సుమారు రూ.50 లక్షలకు పైగా రైతులకు నష్టం వాటిల్లిందని వెంకన్నాయుడు అన్నారు. తోటలలో చెట్లు బాగా తయారై మరొక ఆరు నెలలో కోతకు వచ్చే సమయంలో ఎకరానికి రూ.3.5 లక్షల విలువైన సరుగుడు చెట్లు బూడిదయ్యాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ ఘటనతో సుమారు పది మంది రైతులు నష్టపోయారని సర్పంచ్ తెలిపారు.
తాగునీటి సరఫరాకు
రూ.1650 కోట్లు
● సెంట్రల్ వాటర్ గ్రిడ్ నుంచి మంజూరు
● పనులు ప్రారంభించిన
ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
మలికిపురం: కోనసీమలో తాగునీటి సరఫరాకు సెంట్రల్ వాటర్ గ్రిడ్ పథకం నుంచి రూ.1650 కోట్లు మంజూరైట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ వెల్లడించారు. పథకం పనుల్లో భాగంగా మండలంలోని విశ్వేశ్వరాయపురం, ఇరుసుమండ, గూడపల్లి గ్రామాల్లో నిర్మాణం కానున్న ట్యాంకుల పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. మెగా ఇంజినీరింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం జిల్లాలో చివరి దశలో ఉండడం ఇక్కడ ఉప్పునీటి తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఇక్కడ మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టు నీటిని బొబ్బర్లంక గోదావరిలో ఏర్పాటు చేసే ఇన్టేక్ వెల్ నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నీటిని తరలించి ఆత్రేయపురం మండలం వెలిచేరులో ఏర్పాటు చేసే 75 ఎంఎల్డీ ట్రీట్ మెంట్ ప్లాంట్కు తరలించి శుద్ధి చేస్తారన్నారు. ఆ నీటిని 5 మీటర్ల వ్యాసార్థంతో ప్రత్యేక పైప్లైన్ ద్వారా నియోజకవర్గానికి సరఫరా చేయనున్నట్టు తెలిపారు. మధ్యలో రెండు చోట్ల పంపంగ్ వేగం పెంచేందుకు సంప్లు నిర్మించి మోటార్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే ఇక్కడ అమలులో ఉన్న తాగునీటి పథకాల పైప్లైన్కు అనుసంధానం చేయడం ద్వారా గ్రామాలకు అందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. మెగా సంస్థ ఇంజినీర్ శ్యాం మాట్లాడుతూ ఈ భారీ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యాప్తంగా తాగునీరు అందుతుందన్నారు. పి.గన్నవరంపైన రెండు పాయింట్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి మిగిలిన నియోజక వర్గాలకు తాగునీటిని మళ్లిస్తామన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం తాగునీరు వెలిచేరులో ఎంఎల్డీ పాయింట్ వద్దే ఫిల్టర్ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, జెడ్పీటీసీ బల్ల ప్రసన్నకుమారి, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ తొలిరోజు పరీక్షకు 38 మంది గైర్హాజరు

డీఎస్సీ తొలిరోజు పరీక్షకు 38 మంది గైర్హాజరు