నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు

Jun 5 2025 9:18 AM | Updated on Jun 5 2025 9:18 AM

నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు

నేటి నుంచి బాలాజీ కల్యాణోత్సవాలు

మామిడికుదురు: ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ కాశీలో గంగానది అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరంలో వెలసిన బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలు గురువారం నుంచి 9వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. స్వామి వారి దివ్య తిరు కల్యాణం శుక్రవారం రాత్రి 9.15 గంటలకు జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో జరుగుతుందని ఈఓ తెలిపారు. గురువారం జ్యేష్ఠ శుద్ధ దశమి ఉదయం ఆరు గంటలకు విశ్వక్సేనారాధనతో కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. శ్రీదేవి, భూదేవితో పాటు బాల బాలాజీని వధువు, వరులుగా చేసి బుగ్గన కల్యాణం తిలకం తీర్చిదిద్దే మహత్తర ఘట్టంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. కల్యాణోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు స్వామి వారి రాయబారోత్సవం జరుగుతుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వేద సదస్యం (పండిత సన్మానం) ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి వారికి పవిత్ర వైనతేయ గోదావరి నదిలో చక్రస్నానం నిర్వహిస్తారు. సోమ వారం ఉదయం 9 గంటలకు చోర సంవాదం, సాయంత్రం ఏడు గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, బుత్విక్‌ సన్మానంతో స్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణమవుతాయి. కల్యాణోత్సవాలు జరిగే అయిదు రోజులు ఆలయం వద్ద పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశా రు. కల్యాణోత్సవాల నిర్వహణకు ఆలయం వద్ద భారీ గా ఏర్పాట్లు చేశారు. భారీగా విద్యుత్‌ అలంకరణలు ఏర్పాటు చేశారు. స్వామి వారి ఆలయాన్ని పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

రేపు స్వామివారి తిరు కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement