
యోగాతో పరవశించిన సాగర తీరం
సఖినేటిపల్లి/మలికిపురం: అంతర్వేది సాగర తీరం మంగళవారం యోగాతో పరవశించింది. సుమారు 3 వేల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం సముద్ర తరంగాల సాక్షిగా, సూర్యోదయ కిరణాల మధ్య శరీరం, మనసు, శ్వాసలు సమన్వయంతో ఒక్కటై యోగా ముద్ర వేశాయి. అంతర్వేది బీచ్లో యోగాంధ్ర 2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి పాల్గొని మాట్లాడుతూ ప్రతి రోజూ కేవలం పది నిమిషాలైనా యోగా చేయడం వల్ల జీవితంలో గొప్ప మార్పులు వస్తాయన్నారు. జిల్లా యంత్రాంగం ఆహ్వానంతో యోగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ సోషల్ మీడియా యోగా యాక్టివిస్ట్ లక్కవరంనకు చెందిన వేగేశ్న పూజాకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ యోగాంధ్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. డీఆర్ఓ బి. రాజకుమారి, అమలాపురం ఆర్డీవో కె.మాధవి, డీఈఓ షేక్ సలీంబాషా, పీడీ డ్వామా మధుసూదన్, జి.ఎస్.డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసర్ రాజేశ్వరరావు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.కె.నవాబ్ జాన్ జిల్లా అధికారులు, మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యోగాతో పరవశించిన సాగర తీరం