
వెన్నుపోటులో సిద్ధహస్తుడు చంద్రబాబు
● మాజీ ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి ధ్వజం
● నేడు అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం పేరిట నిరసనలు
కొత్తపేట: నమ్మిన వారిని వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడని మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం శ్రీవెన్నుపోటు దినంశ్రీ పేరిట అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన రావులపాలెం మండలం గోపాలపురంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. గడచిన ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలతో ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం వాటి అమలును గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలనూ నేడు నిలిపివేసి పేదలను అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. కరెంటు చార్జీలు, నిత్యావసర సరకుల ధరలు పెంచి, ప్రజలపై భారం మోపిందన్నారు. సీఎం చంద్రబాబుకు అమరావతి తప్ప ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. అందుకే ఎన్నికలు జరిగి జూన్ 4కు ఏడాది అవుతున్నందున వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మోసాలను ఎండగడతామని, హామీలు నెరవేర్చే వరకూ ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామన్నారు.
నియోజకవర్గంలో కార్యక్రమం ఇలా..
కొత్తపేట నియోజకవర్గం వెన్నుపోటు దినం కార్యక్రమాలను జగ్గిరెడ్డి వివరించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గంలో 4 మండలాల నుంచి పార్టీ శ్రేణులు రావులపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్దకు చేరుకుంటారు. 10 గంటలకు అక్కడి నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమై రావులపాడు రోడ్డు వరకూ సాగి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని తిరిగి ఆంజనేయస్వామి గుడి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మెమోరాండం సమర్పిస్తామని తెలిపారు.