స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి.. | - | Sakshi
Sakshi News home page

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..

Jun 2 2025 12:15 AM | Updated on Jun 2 2025 12:15 AM

స్ఫూర

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..

ప్రజ్ఞావేత్త చిరంజీవిని కుమారి అస్తమయం

ప్రజల సందర్శనార్థం నేడు ఇంద్రపాలెం ఐడియల్‌ కళాశాలలో పార్థివ దేహం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గోదావరి జిల్లాల్లో ప్రఖ్యాత విద్యాసంస్థలు ఐడియల్‌ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు, సీ్త్ర హక్కుల పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్‌ పి.చిరంజీవిని కుమారి (94) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె భర్త పీఎస్‌ శర్మ పదేళ్ల క్రితం మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు గోపాల్‌ వైద్యవృత్తిలో కొనసాగుతుండగా, చిన్నకుమార్‌ కిరణ్‌ ఐడియల్‌ కళాశాల అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నారు. పూర్వ విద్యార్థులు, సాహితీ ప్రియులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని ఇంద్రపాలెం ఐడియల్‌ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం 11 గంటల వరకూ ఉంచనున్నారు. 1931 మార్చి 30వ తేదీన జన్మించిన డాక్టర్‌ చిరంజీవిని కుమారి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి కొద్దికాలం సేవలందించి, డాక్టర్‌ పి.వి.ఎన్‌.రాజుతో కలిసి 1970లో ఐడియల్‌ జూనియర్‌ కళాశాలతో ఐడియల్‌ విద్యాసంస్థను ప్రారంభించారు. క్రమేణా డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు స్థాపించి లక్షలాది మంది విద్యార్థులను తయారు చేశారు. ఒకపక్క విద్యాసంస్థల నిర్వహణతో పాటు తూర్పుగోదావరి రచయితల సంఘం కార్యదర్శిగా జిల్లాలో భాషా సాహిత్యాభివృద్ధికి చాలా కృషిచేశారు. ఐడియల్‌ విద్యాసంస్థల్లో తెలుగు భాషను మాత్రమే ద్వితీయ భాషగా కొనసాగిస్తూ, తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎనలేని సేవలు అందించారు. మహాకవి శ్రీ శ్రీ సప్తతి, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య వేడుకలు, పద్మశ్రీ డాక్టర్‌ గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం మొదలైన కార్యక్రమాలు ఐడియల్‌ విద్యాసంస్థల ద్వారా జరిపించారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి, జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రచనకు సారథ్యంతో పాటు జన విజ్ఞాన వేదికకు సేవలందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండలి సభ్యురాలిగా సేవలందించి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తూర్పుగోదావరి అనే గ్రంథాన్ని రచించి ప్రశంసలు పొందారు. ఏయూ నుంచి స్వర్ణ పతాక అవార్డు పొందారు.

డాక్టర్‌ శిఖామణి సంతాపం

యానాం: ప్రముఖ విద్యావేత్త, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఐడియల్‌ కాలేజీ కరస్పాండెంట్‌, అభ్యుదయ రచయిత్రి డాక్టర్‌ పి.చిరంజీవినికుమారి మృతిపట్ల యానాం కవిసంధ్య సంపాదకుడు, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్‌ శిఖామణి ఆదివారం ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్‌ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల నుండి కవిసంధ్య పత్రిక వరకు ఆమె అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. వయోభారాన్ని సైతం పక్కనపెట్టి గత సంవత్సరం కథా సదస్సు నిర్వహించడం, గత నెలలో యానాంలో కవిసంధ్య నిర్వహించిన దాట్ల అభినందన సభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆయన మృతి అటు జిల్లా విద్యారంగానికి, సాహిత్యరంగాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.

జిల్లా క్రీడారంగానికి తీరని లోటు

ఒలింపిక్‌ సంఘ కార్యదర్శి ఎలీషాబాబు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 25 సంవత్సరాల పాటు జిల్లా ఒలింపిక్‌ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందించిన, ఐడియల్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ డాక్టర్‌ పి.చిరంజీవిని కుమారి మృతి జిల్లా క్రీడారంగానికి తీరని లోటని జిల్లా ఒలింపిక్‌ సంఘ కార్యదర్శి డాక్టర్‌ జి.ఎలీషాబాబు పేర్కొన్నారు. డాక్టర్‌ చిరంజీవినీ కుమారి ఒలింపిక్‌ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా సేవలు అందించారన్నారు. అన్ని క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆర్థికంగా వివిధ క్రీడాపోటీల నిర్వహణకు, ఒలింపిక్‌ సంఘానికి చేయూతనిచ్చారని తెలిపారు. రాజమహేంద్రవరం నన్నయ యూనివర్శిటీ ఏర్పాటులో కూడా గోదావరి సాధన సమితి ద్వారా ఆమె చేసిన కృషి ఎంతో ఉందన్నారు. ఒలింపిక్‌ రన్‌ కన్వీనర్‌గా మినీ ఒలింపియాడ్‌, ఒలింపిక్‌ రన్‌ నిర్వహణలో చాలాకాలం ఆమె సర్టిఫికెట్లు అందించారన్నారు. వాలీబాల్‌ సంఘానికి కూడా ఆమె సేవలు అందించారని తెలిపారు. ఒలింపిక్‌ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, గౌరవ అధ్యక్షుడు చుండ్రుగోవిందరాజు, కర్రిభామిరెడ్డి, డీఎస్‌డీఓ బిశ్రీనివాస్‌ కుమార్‌, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్‌.జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీను, మాచరరావు చిరంజీవినీ కుమారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

గొప్ప సాహితీవేత్తను కోల్పోయాం

విద్య, సామాజిక, సాహితీవేత్తగా పేరొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్‌ పి.చిరంజీవినీ కుమారి మృతి సమాజానికి తీరని లోటు. జిల్లా చరిత్రను గ్రంథస్తం చేసిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,

మాజీ మంత్రి

సామాజ ఉన్నతికి పాటుపడిన

గొప్ప విద్యావేత్త

ఎంతోమంది విద్యార్థులను ఐడి య కళాశాల ద్వారా చిరంజీవినికుమారి ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి మంచి పౌరులను అందించారు. ఇంటర్‌, డిగ్రీతోపాటు ఇంజినీరింగ్‌ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఇంజినీరింగ్‌ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆమె మరణం సాహితీ వేత్తలకు, రచయితలకు తీరని లోటు.

– డాక్టర్‌ పి.కృష్ణారావు, ప్రగతి కళాశాల చైర్మన్‌

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..1
1/2

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..2
2/2

స్ఫూర్తినిచ్చి.. ఆర్తి మిగిల్చి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement