
అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యం
కొత్తపేట: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. కొత్తపేటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ప్రగతిశీల రాష్ట్రంగా నిలిపేందుకు సహకరిస్తుందన్నారు. రూ.3 వేల కోట్లతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, అమలాపురం నుంచి కాకినాడ 4 లైన్ల హైవే, జొన్నాడ హైవే నుంచి యానాం హైవే వరకూ రూ.200 కోట్లతో ఏటిగట్టు రోడ్డు విస్తరణ, కోనసీమ అభివృద్ధి, ఇక్కడ టూరిజం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్టు తెలిపారు. కృష్ణా, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం ఇసుక అక్రమ నిల్వలు, రవాణాపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేపు వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకుని నిల్వలు పెడతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలో కూడా వరదలను దృష్టిలో పెట్టుకునే నిల్వలు పెడితే చంద్రబాబు, కూటమి నాయకులు గుట్టల వద్ద ఫొటోలు తీయించుకుని విమర్శలు చేశారు? అన్న ప్రశ్నకు అప్పటి కంటే ఇప్పుడు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంఏ వేమా, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం పాల్గొన్నారు.