
అప్పనపల్లిలో భక్తజన కోలాహలం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. అర్చకులు, వేద పండితులు తెల్లవారుజామున సుప్రభాత సేవ నిర్వహించారు. తొలి హారతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తులు తొలి హారతితో పాటు శ్రీదేవి, భూదేవీ సమేతుడైన బాల బాలాజీ స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి వారు స్వయంభువుగా వెలసిన పాత ఆలయాన్ని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.4,03,024 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 5,800 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. మూడు వేల మంది స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.90,835 విరాళాలుగా అందించారని పేర్కొన్నారు.