ఎండీయూ ఆపరేటర్లను అవమానిస్తారా? | - | Sakshi
Sakshi News home page

ఎండీయూ ఆపరేటర్లను అవమానిస్తారా?

Jun 1 2025 12:17 AM | Updated on Jun 1 2025 12:17 AM

ఎండీయూ ఆపరేటర్లను అవమానిస్తారా?

ఎండీయూ ఆపరేటర్లను అవమానిస్తారా?

సాక్షి, అమలాపురం: ‘ఇంటింటా రేషన్‌ అందించే ఎండీయూ వాహనాల యజమానులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగ్రవాదులతో పోల్చడం దారుణం. ప్రభుత్వంతో కలిసి పని చేసేవారిని కించపరుస్తూ.. వ్యక్తిత్వ హననానికి గురి చేయడం దేశంలో మరే ముఖ్యమంత్రీ చేసిన చరిత్ర లేదు’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ఆయన శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వాహనాల యజమానులకు న్యాయం చేయాలని కోర్టు మొట్టికాయ వేస్తే వారిని ఉగ్రవాదులతో పోల్చడం దారుణమని మండిపడ్డారు. సీఎంగా చంద్రబాబు వస్తే తమ బాధలకు పరిష్కారం చూపుతారని జిల్లావాసులు ఎంతో ఆశగా ఎదురు చూస్తే నిరాశకు గురి చేశారని అన్నారు. మహానాడులోనే కాదు.. కోనసీమలో కూడా చంద్రబాబు అబద్ధాలే మాట్లాడారని దుయ్యబట్టారు. ‘జిల్లాలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో సొమ్ము ఇస్తామన్నారు. తరువాత 46 గంటల్లోనైనా చెల్లిస్తామని చెప్పారు. ఈ రోజుకు కూడా కూడా చెల్లించలేదు. ఇప్పటికీ రూ.కోట్ల బకాయిలున్నాయి. దీనిపై సీఎం హోదాలో చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని విమర్శించారు. మహానాడులో అందరితో పొగిడించుకునే శ్రద్ధ జిల్లాలో రైతులపై లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. మహిళలను చంద్రబాబు మోసం చేశారని, దఫదఫాలుగా గ్యాస్‌ ఉచితంగా అందిస్తామని చెప్పి, చివరకు గ్యాస్‌ కొట్టి వెళ్లారన్నారు. ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 ఇస్తానని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దగా చేశారన్నారు. ‘గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా గ్రూపులు తీసుకున్న రూ.26 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి, ఆ లబ్ధిని మహిళలకు దఫదఫాలుగా అందించారు’ అని గుర్తు చేశారు.

నిరుద్యోగుల విషయంలో కూడా బాబు నోరు మెదపలేదని జగ్గిరెడ్డి అన్నారు. రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాలు కల్పిస్తానన్నారని, ఆ పెట్టుబడుల సొమ్ము ఆయన ఎక్కడ దాచిపెట్టిందీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో కూడా చెప్పలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6.14 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి పదో తరగతి పరీక్షలు రాశారని, వాటి స్పాట్‌ వేల్యుయేషన్‌లో తీవ్ర తప్పిదాలు జరిగాయని, దీనికి చంద్రబాబు పుత్రరత్నం, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ కారణం కాదా అని ప్రశ్నించారు. ‘సఖినేటిపల్లికి చెందిన ఒక అమ్మాయికి సోషల్‌ సబ్జెక్టులో తొలుత 23 మార్కులు వచ్చాయి. రీ వెరిఫికేషన్‌కు వెళితే 84 మార్కులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 66 వేల మంది తల్లిదండ్రులు రీ వేల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారంటే కూటమి ప్రభుత్వం వైఫల్యం, వ్యక్తిగతంగా లోకేష్‌ అసమర్థత కారణం’ అని జగ్గిరెడ్డి మండిపడ్డారు. తప్పులకు కారకులైన అసలు వ్యక్తులను వదిలేసి, ఐదుగురు చిరుద్యోగులను సస్పెండ్‌ చేస్తే ప్రభుత్వ అసమర్థత ప్రజలకు తెలియకుండా పోదని అన్నారు. ఇసుక మీద చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎవరైనా అక్రమాలు చేస్తే మీ వెనుక నా డ్రోన్‌ తిరుగుతోందని బాబు అంటున్నారని, కానీ మొన్న ముమ్మిడివరంలో ఎనిమిది మంది, పి.గన్నవరంలో ముగ్గురు పిల్లలు గోదావరి స్నానానికి వెళ్లి చనిపోవడానికి ఇసుక అక్రమ తవ్వకాలే కారణమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయన్నారు. జిల్లాకు వచ్చిన చంద్రబాబు చనిపోయిన కుటుంబాలకు పరిహారం అందించకపోవడం దారుణమని జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ ప్రభుత్వంలో భాగస్వాములైన వారిని ఉగ్రవాదులంటారా?

ఫ జిల్లాకు మేలు చేసే ఒక్క

ప్రకటనయినా చేశారా?

ఫ చంద్రబాబుపై వైఎస్సార్‌ సీపీ నేత జగ్గిరెడ్డి ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement