
కూటమి పాలనలో విలేకర్లపై పెరిగిన దాడులు
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో విలేకర్లపై దాడులు పెరిగిపోయాయని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అయినవిల్లి మండల సాక్షి విలేకరి బావిశెట్టి నాగేశ్వరరావుపై అయినవిల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ముసుగులు ధరించి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. అమలాపురంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావును ఆయన శనివారం పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి విలేకరిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజవర్గ ఇన్చార్జి గన్నవరం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్ సీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెండగుదిటి శిరీష్, విఘ్నేశ్వరస్వామి ఆలయం మాజీ చైర్మన్ గుత్తుల నాగబాబు, నాయకులు సలాది బుచ్చిరాజు, మద్దాల చంటిబాబు, గుర్రాల రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు.
‘ఉపాధి’ బకాయిల
కోసం రేపు ధర్నా
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి.శివ, దైవవాణి తెలిపారు. అమలాపురం మండలం కామనగరువు పరిధిలోని కరక్కాయపేటలో శనివారం వారు ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలకు గతంలో అనేక సదుపాయాలు కల్పించేవారని, టెంట్లు, మెడికల్ కిట్లు, మంచినీరు, మజ్జిగ ఇచ్చేవారని, మేట్లకు రూ.5 ప్రోత్సాహం ఇచ్చేవారని చెప్పారు. గతంలో ఒక్క పూట మాత్రమే పని చేయించేవారని, కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలన్నీ రద్దు చేశారని, రెండు పూటలా మస్తరు వేయాలనే నిబంధన పెట్టారని చెప్పారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఉపాధి కూలాలకు జిల్లాలో రూ.55 కోట్లు పైగా వేతన బకాయిలున్నాయని చెప్పారు. కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వాన్ని తరమికొట్టాలి
ఆలమూరు: గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సక్రమంగా అమలు చేయకుండా పేద వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని తరమి కొట్టాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. మండలంలోని చెముడులంక వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయం వద్ద మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ప్రజల మన్ననలను పొందిన రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని రద్దు చేసి అందులో పనిచేస్తున్న ఆపరేటర్లను రోడ్డు మీద పడవేశారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల విద్యుత్ బిల్లులు నాలుగింతలు పెంచేచారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటి వరకూ ఒక రేషన్కార్డును కాని, పింఛన్ను కాని మంజూరు చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల నాలుగున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు.
కార్యక్రమంలో పార్టీ శ్రేణులంతా అధిక సంఖ్యలో పాల్గొని వెన్నుపోటు దినం ఆవశ్యకతను, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చాటి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం వెన్నుపోటు దినం పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. పార్లమెంటరీ పార్టీ పరిశీలకురాలిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మండలానికి విచ్చేసిన విజయలక్ష్మికి ఘన స్వాగతం లభించింది. ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పీటీసీ తోరాటి సీతామహాలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు, మాజీ ఏజీపీ నామాల శ్రీనివాసు, నాండ్ర నాగమోహన్రెడ్డి, కోలా నాని, చామకూరి శ్రీనివాసు, నాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలనలో విలేకర్లపై పెరిగిన దాడులు