
మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ట నిఘా
అమలాపురం రూరల్: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వాడకం నిరోధంపై బుధవారం కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చి, ఉన్నత లక్ష్యాలకు చేరుకునే దిశగా ప్రోత్సహించాలన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై పోస్టర్లు, పాంప్లేట్లు, బ్యానర్లు వేయించి, వాటిని స్కూళ్లు, కాలేజీల ఆవరణలో ఏర్పాటు చేయాలన్నారు.
● రహదారి భద్రత దృష్ట్యా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఆయన అధ్యక్షతన కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా, కార్లలో సీట్ బెల్టు పెట్టుకునేలా చూడాలన్నారు. జొన్నాడ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.