
గోదావరిలో క్రాంతి కిరణ్ మృతదేహం లభ్యం
ముమ్మిడివరం: కమిని పంచాయతీ శివారు సలాదివారిపాలెంలోని గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల్లో సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహం బుధవారం ఉదయం సంఘటన స్థలంలో లభ్యమైంది. కె.గంగవరం మండలం శేరిల్లంకలో స్నేహితుడి ఇంట సోమవారం జరిగిన ఓణీ ఫంక్షన్లో పాల్గొనేందుకు వచ్చిన ఎనిమిదిమంది యువకులు గోదావరిలో గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ఐ.పోలవరం మండలం జి.మూలపొలం శివారు ఎర్రగరువుకు చెందిన వడ్డి మహేష్, వడ్డి రాజేష్, కాకినాడ తూరంగికి చెందిన యలవర్తి సాయి మహేష్, కాకినాడ గోళీలపేటకు చెందిన సబ్బతి పాల్ అభిషేక్, కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన ఎలిపే మహేష్, మండపేటకు చెందిన కులపాక రోహిత్, కరప మండలం గురజనాపల్లికి చెందిన తాతపూడి నితీష్ల మృతదేహాలు మంగళవారం దొరికాయి. సబ్బతి క్రాంతి కిరణ్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కనుగొన్నారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించా రు. కాగా.. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. ఆయన బుధవారం ఉదయం సంఘటనా స్థలంలో క్రాంతి కిరణ్ మృతదేహన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జి.మూలపొలం శివారు ఎర్రగరువు చెందిన అన్నదమ్ములు వడ్డి మహేష్, వడ్డి రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.