పెళ్లి చేయడం లేదని తండ్రిని కడతేర్చిన తనయుడు

Chennai The Son Who Killed His Father For Not Marrying - Sakshi

తమిళనాడులో వెలుగు చూసిన దారుణం

చెన్నై: సింగపెరుమాళ్‌కోవిల్‌ సమీపాన బుధవారం వివాహం జరిపించలేదని తండ్రిని తనయుడు హతమార్చాడు. సింగపెరుమాళ్‌కోవిల్‌ పెరియవింజియంబాక్కంకు చెందిన చంద్రశేఖర్‌ (68). కిరాణా దుకాణం నడుపుతూ వచ్చాడు. ఇతని భార్య చంద్ర. వీరికి దురైమురుగన్, శ్రీనివాసన్, బాలమురుగన్‌ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. దురైమురుగన్‌కు వివాహమై మదురైలో ఉన్నాడు. బాలమురుగన్‌ అదే ప్రాంతంలో విడిగా కిరాణా దుకాణం నడుపుతున్నాడు. శ్రీనివాసన్‌ దుకాణానికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ వచ్చాడు. ఇరువురికి వివాహం కాలేదు. ఇదిలా వుండగా శ్రీనివాసన్‌కు వివాహం జరిపించకుండా తల్లిదండ్రులు బాలమురుగన్‌కు వధువును అన్వేషిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసన్‌ తరచుగా తండ్రితో తగాదా పడేవాడు. తనకు మొదటగా వివాహం జరిపించాలని కోరాడు.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా దీనిపై తగాదా జరిగింది. హఠాత్తుగా శ్రీనివాసన్‌ ఇనుపరాడ్‌తో తండ్రిపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడి చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన చంద్రశేఖర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరైమలర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్రీనివాసన్‌ కోసం గాలిస్తున్నారు. కాగా తండ్రిని కుమారుడే హత్య చేయడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. వృద్ధాప్యంతో తోడూ నీడగా.. ఉండాల్సిన బిడ్డే జులాయిగా తిరుగుతూ.. తండ్రి మరణానికి కార ణం కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి: ఎన్నికల రిజర్వేషన్‌ మహిళకు రావడంతో... పెళ్లి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top