వైద్యం @ 22!
జిల్లాలో కుంటుపడుతున్న సేవలు వైద్యుల హాజరుపై అసంతృప్తి సెగలు మందుల పంపిణీపై పెదవి విరుస్తున్న రోగులు సర్వేలో జిల్లాకు 22వ స్థానం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో 50 పీహెచ్సీలు, 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఒక్కోచోట నిత్యం 70 నుంచి 150కి పైగా ఓపీలు నమోదవుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సకాలంలో రావడం లేదు. ఇద్దరు డాక్టర్లులుంటే.. ఒకరు 104 సేవలు చూసుకోవాలి. మకొకరు...ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలి. కానీ ముఖ హాజరు వేసుకుని సర్వేలు, క్షేత్ర తనిఖీల పేరుతో బయటకు వెళ్తున్నారు. సొంత క్లినిక్లో కూర్చుని జేబులు నింపుకుంటున్నారు. లేకుంటే యూనియన్ల పేరుతో దర్జాగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. డెప్యూటేషన్ అంటూ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. దీంతో పలు పీహెచ్సీలు ఖాళీగా బోసిపోతున్నాయి. ఈ విషయాలు తెలిసినా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇటీవల చిత్తూరు నగరంలోని చవటపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేయగా వైద్యులు 10 గంటలు దాటినా రాలేదు. విచారిస్తే ఆ డాక్టర్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే ఓ జూనియర్ అధికారి బంధువని తెలిసింది. ఇటీవల ఎంపీ శ్రీరంగరాజుపురం పీహెచ్సీని తనిఖీ చేస్తే డాక్టరు విధుల్లో లేరని గుర్తించి.. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రాత్రి పూట ఉండరే?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాత్రి పూట కూడా పనిచేసేలా ఆదేశాలున్నాయి. స్టాఫ్ నర్సులు డ్యూటీలో ఉండాలనే నిబంధన ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాత్రి పూట వైద్య సేవలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక ప్రసవాలను స్థానికంగానే చేయాలనే లక్ష్యంతో నిర్దేశించింది. కానీ ఆ దిశగా పీహెచ్సీలు పనిచేయడం లేదనే విమర్శలున్నాయి.
పడకేసిన ప్రాథమిక వైద్యం
వైద్యానికి డబ్బులా?
బాబు ప్రభుత్వం వచ్చాక వైద్య సేవలు తూతూమంత్రంగా మారాయి. పలు కేంద్రాల్లో ఆరోగ్య సేవలకు కాసులు గుంజుకుంటున్నారు. సూది వేస్తే రూ.50, కట్టుకడితే రూ.50 నుంచి రూ.100, సైలెన్బాటిల్ పెడితే రూ.100 నుంచి రూ.200, ల్యాబ్ టెస్ట్కు రూ.100 నుంచి రూ.300 వరకు గుంజుతున్నట్టు సర్వేలో తేలింది. అలాగే ఇక్కడ పలు టెస్టులు చేయాలేమని.. బయట చేసుకోవాలని, దీనికి రూ.600 అవుతుందని చెప్పి వసూలు చేస్తున్నట్లు సర్వేలో పలువురు స్పష్టం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో అందిన సేవలకు డబ్బులు అడిగారని సర్వే చేయగా.. 83,160 మంది స్పందించారు. ఇందులో 31,325 మంది(37.67శాతం) డబ్బులు అడిగారని సమాధానమిచ్చారు. ఈ లోపాలతో జిల్లా 22 స్థానంలో నిలిచింది. మొత్తం మీద వైద్య సేవలపై 61.7 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేస్తే.. 38.3 శాతం మంది అసంతృప్తిని వ్యక్తపరిచారు. వీటన్నింటికీ ప్రధాన కారణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణాలోపమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మందులు, మాత్రలు ఏవీ?
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు కూడా లేవని గుర్తించింది. చాలా వరకు బయట రాసిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ లోపాలను 30,651 మంది(37.82శాతం) వెల్లడించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత పూర్తిగా లోపిస్తోంది. ఈ విషయాన్ని 34,724 (42.65 శాతం) మంది గుచ్చి చెప్పారు.
వైద్యం @ 22!


