
కొబ్బరి.. డిమాండే మరి!
చెట్టెక్కిన కొబ్బరి బొండాల ధర
● తోటల వద్ద కాయ రూ.25 ● హోల్సేల్ వారికి రూ.30 ● రిటైల్లో కాయ ధర రూ.40 ● మామిడికి ప్రత్యామ్నాయంగా కొబ్బరితోటలే మేలంటున్న ఉద్యానశాఖ
పలమనేరు: సాధారణంగా వేసివిలో కొబ్బరి బొండాలకు డిమాండ్ ఉంటుంది. కానీ అన్ సీజన్లోనూ కొబ్బరి బొండాల ధర పెరుగుతూనే వస్తోంది. ఇదే సమయంలో మామిడి కాయలను కొనేవారు లేక రోడ్డుపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మామిడి తోటలున్న రైతులు ప్రత్యామ్నాయంగా కొబ్బరి తోటలను సాగుచేయడం మేలని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక్కో కొబ్బరి బొండాం రూ.45
పలమనేరు రెవెన్యూ డివిజన్లో కొబ్బరితోటలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ పొలం గట్లలో వీటిని పెంచడం ఇక్కడి ఆనవాయితీ. కొందరు రైతులు మాత్రం కొబ్బరి తోటలను పెంచారు. ఇప్పుడు నెలకొన్న డిమాండ్ కారణంగా స్థానిక వ్యాపారులు రైతుల వద్ద ఓ కొబ్బరిబొండాన్ని రూ.25 దాకా కొంటున్నారు. వీటిని సేకరించి బయటి వ్యాపారులకు రూ.30 దాకా అమ్ముతున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా బొండాలు మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ, బిహార్, రాష్ట్రంలోని కడప, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరు పేటకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి హోల్సేల్ వ్యాపారుల నుంచి రిటైల్ వ్యాపారులు రూ.35తో కొంటున్నారు. రిటైల్ మార్కెట్లో కాయ రూ.45గా విక్రయిస్తున్నారు. అదే లీటర్ కొబ్బరినీళ్లు రూ.120 దాకా విక్రయిస్తున్నారు.
మామిడికి బదులు కొబ్బరి తోటలే మేలు
జిల్లాలో తోతాపురి మామిడి ఏటా నష్టాలు చేకూర్చుతోంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మామిడి రైతులు కాయలు అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. దీంతో పంట పెట్టుబడిమాట దేవుడెరుగు కనీసం కూలి కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు మామిడి తోటలను కోసేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కొబ్బరి తోటలు సాగుపై దృష్టి సారిస్తున్నారు. దీనిపై జిల్లా ఉద్యానశాఖ దృష్టి సారించి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.
అవగాహన కల్పిస్తున్నాం
ఏటా మామిడి సీజన్లో తోతాపురికి గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మామిడికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై దృష్టి సారించాలని గత రెండేళ్లుగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మామిడికి బదులు కొబ్బరి కూడా మంచిదే.
– మధుసూదన్రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి, చిత్తూరు
భారీగా నష్టాలు రావు
నేను పదేళ్లుగా కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నా. ఇందులో రైతులకు మేలు, నష్టం బాగా తెలుసు. మామిడితోటలకు లాగా వీటికి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయనవసరం లేదు. అందుకే ఇక్కడి కొబ్బరి బొండాలకు దేశంలోని పలు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంటుంది. లాభాలే తప్ప నష్టాలుండవు.
– ఖాదర్బాషా, కొబ్బరిబొండాల వ్యాపారి, బైరెడ్డిపల్లి
ప్రత్యామ్నాయం చూసుకుంటా
నేను మూడు దశాబ్దాలుగా మామిడితోటలను సాగుచేస్తున్నా. ఈ దఫా మామిడి పరిస్థితి చూసి ఇక లాభం లేదనుకున్నా. అందుకనే మామిడికి బదులు ప్రత్యామ్నాయంగా వేరే పంట సాగు చేయాలని అనుకుంటున్నా. ఉద్యానశాఖ సూచనలు తీసుకొని గ్యారెంటీ గిట్టుబాటుంటే పంటలను సాగుచేస్తా.
– సుబ్రమణ్యం నాయుడు, రైతు, రామాపురం
పెరిగిన ధరలు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు వద్ద మద్దూరు కోకొనెట్ మార్కెట్ ఆసియాలోనే పెద్దది. ఇక్కడికి కావేరి నదీ పరివాహక ప్రాంతం నుంచి నాణ్యమైన కొబ్బరి బొండాలు వస్తుంటాయి. అక్కడి నుంచి దేశ విదేశాలకు బొండాల ఎగుమతులు సాగుతుంటాయి. అలాంటి మార్కెట్లోనే ఇప్పుడు డిమాండ్కు సరిపడా సరుకు లేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

కొబ్బరి.. డిమాండే మరి!

కొబ్బరి.. డిమాండే మరి!

కొబ్బరి.. డిమాండే మరి!

కొబ్బరి.. డిమాండే మరి!

కొబ్బరి.. డిమాండే మరి!