
ఎరువుల దుకాణాలపై దాడులు
పెనుమూరు(కార్వేటినగరం): ఎరువుల దుకాణాలపై సోమవారం స్టేట్ విజిలెన్స్ స్క్వాడ్ దాడులు నిర్వహించింది. ఏడీఏ ధనుంజయరెడ్డి, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రవి మాట్లాడుతూ డీలర్లందరూ ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలన్నారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎరువుల దుకాణాలను పరిశీలించి నిల్వల వివరాలను, అమ్మకాలు జరిపిన బిల్లులను పరిశీలించారు. ఎరువుల ధరల డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ దాడుల్లో చిత్తూరు డీఏఓ కార్యాలయం ఏవో శ్రీకాంత్రెడ్డి, పెనుమూరు వ్యవసాయ అధికారి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.
వెబ్ల్యాండ్ ప్రక్రియను పర్యవేక్షించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వెబ్ల్యాండ్ ప్రక్రియను ఆర్డీవోలు పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె చాంబర్లో రెవెన్యూ, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వెబ్ల్యాండ్ ప్రక్రియలో తహసీల్దార్ల నుంచి ఒరిజినల్ ఫైళ్లను తెప్పించుకుని ఆర్డీవోలు పరిశీలించాలన్నారు. లబ్ధిదారులను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా స్లాట్లు ఇచ్చి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో జిల్లాలో మొదటి దశలో 31 గ్రామాలలో చేపట్టినట్లు తెలిపారు. ఈ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆర్వోఆర్లను ఆర్డీవో లు వెంటనే ప్రచురించాలన్నారు. ఈ నెలాఖరు లోపు జిల్లాలోని వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేషన్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పట్టాకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను గుర్తించాలన్నారు. గ్రామసభలు నిర్వహించి జాయింట్ ఎల్పీఎం దరఖాస్తులు స్వీకరించాలన్నారు. డీఆర్వో మోహన్కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం తగదు
చిత్తూరు అర్బన్: ప్రజాఫిర్యాదుల విషయంలో నిర్లక్ష్యం వద్దన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులకు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ సాయినాథ్ కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్క్రైమ్, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 42 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని క్షుణంగా పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గిన్నీస్ రికార్డుకు
టీచర్లు బాధ్యులా?
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం పాలనలో మెగా పీటీఎం పేరుతో గిన్నీస్ బుక్ రికార్డు పొందేందుకు టీచర్లను బాధ్యులు చేయడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్ రెడ్డిశేఖర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇటీవల జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎంను నిర్వహించిందన్నారు. ఇందులో సాంకేతిక లోసుగులు సరిచేయకుండా ఆ తప్పులను టీచర్ల పై వేసి బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. టీచర్ల వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేసినప్పటికీ అవి సరిగా లేవంటూ తిరిగి అప్లోడ్ చేయాలంటూ ఒత్తిడి చేయడం కరెక్టు కాదన్నారు. అప్లోడ్ చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీచేస్తామని టీచర్లను భయాందోళనకు గురిచేయడం అన్యాయమన్నారు. యాప్ల నిర్వహణలో ఏర్పడే సాంకేతిక సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారో కూటమి ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎరువుల దుకాణాలపై దాడులు