కాణిపాకం: కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో సోమవారం సంకటహర చతుర్థి గణపతి వ్రతాన్ని భక్తిప్రపత్తులతో నిర్వహించారు. చతుర్థి సందర్భంగా ఉదయం ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు ఉత్సవ మూర్తులను మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆస్థాన మండపంలో కొలువుదీర్చారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా సంకటహర చతర్థి గణపతి వ్రతాన్ని చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణరథంపై ఊరేగింపు
రాత్రి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథంపై ఊరేగారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.