మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి

Jun 27 2025 4:19 AM | Updated on Jun 27 2025 4:19 AM

మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి

మామిడి సబ్సిడీపై అవగాహన కల్పించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు ప్రభుత్వం అందజేసే రూ.4 సబ్సిడీపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇస్తున్న రూ.4 సబ్సిడీని రైతులకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో గతంలో పండే దాదాపు 70 వేల మెట్రిక్‌ టన్నుల మామిడిని వ్యాపారవేత్తలు నేరుగా మామిడి తోటలకే వెళ్లి కొనుగోలు చేసే వారన్నారు. ప్రస్తుతం ర్యాంప్‌ల వద్ద కొనుగోలు తగ్గిందని చెప్పారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలలో మామిడి గుజ్జు పరిశ్రమలు లేవని, ఈ కారణంగా జిల్లాలోని ఇతర మామిడి గుజ్జు పరిశ్రమల వద్దకు రైతులు పోటెత్తుతున్నారన్నారు. మామిడి కాయల దిగుబడి పెరిగి డిమాండ్‌ తగ్గడంతో మార్కెట్‌లో మామిడి కాయల ధర తగ్గిందన్నారు. ప్రస్తుత పరిస్థితి కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో మార్కెట్‌ ధరకు అనుగుణంగా రూ.4 సబ్సిడీని రైతుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరుగుతోందన్నారు. మండలాల్లో ఉన్న ర్యాంప్‌లను మండల వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ అసిస్టెంట్లు తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. షిఫ్ట్‌ల ప్రకారం పనిచేస్తున్న సిబ్బంది ర్యాంప్‌ల వద్ద రైతులు నిర్వహిస్తున్న అమ్మకాలను నిర్దేశించిన ప్రోఫార్మాలలో నమోదు చేసి, కలెక్టర్‌ కార్యాలయానికి పంపాలన్నారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా సబ్సిడీ అందించడం జరుగుతుందన్నారు. తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.4 సబ్సిడీని సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు స్వయంగా మామిడి తోట నుంచి నేరుగా తమ పంటను వేరే రాష్ట్రాలకు సరఫరా చేసినప్పటికీ ఆ వివరాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఈ సమాచారాన్ని విలేజ్‌ అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌ అసిస్టెంట్లు రైతులకు అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement