
అన్నదాతల అగచాట్లు
గంగాధర నెల్లూరు : మండలంలోని మామిడి రైతుల కష్టాలు వర్ణనాతీతం. మండల కేంద్రంలోని జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ గేట్ల వద్ద ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు వేచి చూసినా టోకెన్లు దక్కని రైతుల ఆవేదన పట్టించుకునే వారేలేరు. కనీస సదుపాయాలు కూడా కల్పించని యాజమాన్యం ఎరట్రి ఎండలోనే నడి రోడ్లపైన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే లైన్లో ఉండగా 10 గంటల సమయంలో కొందరు సెక్యూరిటీ గార్డులు వచ్చి ఈ రోజు టోకెన్లు ఇవ్వడం కుదరదు అందరూ వెళ్లిపోండి అంటూ అక్కడ నుంచి పంపేశారు. దీంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తర్వాత 80 మందికి టోకెన్లు ఇచ్చి మిగతా వారిని తరిమేశారు. కాగా ప్రభుత్వం తోతాపూరి రకం మామిడిని ఎనిమిది రూపాయలకు కొనమని మార్గదర్శకాలు విడుదల చేయగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు మాత్రం 6, 7 రూపాయలకే కొంటున్నారని సమాచారం. వే బ్రిడ్జి వద్ద తూకం అవ్వగానే ఆరు ,ఏడు రూపాయలకే కొంటున్నట్లు సంతకాలు సేకరించి ఆ తర్వాత రైతు పేరు మామిడి కాయల బరువు మాత్రం రసీదు ఇచ్చి పంపించడం పై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలని రైతులు నిలదీశారు. కర్మాగారం యాజమాన్యం స్పందిస్తూ ఫాక్టరీ రోజుకు 70, 80 టోకెన్లు మాత్రం ఇవ్వగల సామర్థ్యం కలదని, వందలాది రైతులు వస్తుంటే తామేంచేయ్యాలిఅని అన్నారు. జిల్లా అధికారులు యాజమాన్యాలతో చర్చలు జరిపి మామిడి రైతులను ఆదుకోవాలని రైతుల డిమాండ్ చేశారు.