
కూటమి పాలనలో ఆలయాల విధ్వంసం
● హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం ● ఆలయ ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
సాక్షి, టాస్క్ ఫోర్స్ : ‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు.. దేవాలయాలకు రక్షణ లేకుండా పోయింది.. అమ్మవారి విగ్రహానికి కాళ్లు, చేతులు నరకడం సనాతన ధర్మమా..? హిందువుల మనోభావాలను కూటమి సర్కారు దెబ్బతీస్తోంది అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేసిన శిథిలాలను గురువారం ఆయన పార్టీ నాయకులు, హిందూ సంఘాలతో కలసి పరిశీలించారు. ఆలయం ధ్వంసం చేయడంతో పాటు విగ్రహాలను, శిథిలాలను కాలువలో పడేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి నేతల దాడుల్లో గాయపడిన సిబ్బందిని పరామర్శించారు. అనంతరం అమ్మవారి ఆలయ ఉపచారకులు శ్రీ మహారుద్ర వారాహి స్వామివారిని ఓదార్చారు. అనంతరం కూటమి నేతలు చేసిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పవన్ కల్యాణ్ స్పందించకపోవడం దారుణం
శ్రీ ఆదివారాహి అమ్మవారి ఆలయాన్ని ఇసుక, మట్టి మాఫియా ముఠాలు నేలమట్టడం చేయడం దారుణమైన ఘటన అని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. శిథిలాలను ఒక మురుగు కుంటలో పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికి పవన్ కల్యాణ్ స్పందించకపోవడం వెనుక ఏ కుట్ర దాగుందని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అరాచకాలు
టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రోత్సాహంతోనే టీడీపీ నాయకులు ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆలయాన్ని నేలమట్టం చేసిన వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదంటే దాని వెనుక కూటమి నాయకుల హస్తం లేదంటారా అని మండిపడ్డారు.