
బలవంతపు బదిలీలు..!
ఇచ్చిన మాట ప్రకారం మాన్యువల్ విధానంలో ఎస్జీటీల బదిలీలు నిర్వహించాలని అయ్యోర్లు ఇటీవల రొడ్డెక్కి ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు బండారం బయటపడుతుందని భావించిన కూటమి సర్కారు ఒక మెట్టు దిగింది. మాన్యువల్ బదిలీలకు అంగీకారం తెలిపింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలోని షర్మన్ పాఠశాలలో రెండు రోజులుగా జరుగుతున్న బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. అధికారులు ఏదో ఒక సమస్యను చూపి అయ్యోర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి టీడీపీని నమ్మిన పాపానికి తగిన శాస్తి జరుగుతోందని అయ్యోర్లు లోలోపలే మదనపడుతున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. కౌన్సెలింగ్ ప్రక్రియ ఆపడం.. కొనసాగించడం చేస్తున్నారు. తాజాగా ఈ నెల 12వ తేదీన స్పౌజ్ కోటా విషయంలో అన్యాయం జరుగుతోందని బాధిత ఎస్జీటీ టీచర్లు గురువారం కౌన్సెలింగ్ను బహిష్కరించారు.
కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. స్పౌజ్ విషయంలో జీవో 22కు వ్యతిరేకంగా విద్యాశాఖ అధికారులు బదిలీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు పైగాకౌన్సెలింగ్ను ఆపేసారు. టీచర్ల ధోరణితో విస్తుపోయిన డీఈవో వరలక్ష్మి ఆగ్రహంతో కౌన్సెలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన డీఆర్వో మోహన్కుమార్, పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని బాధిత టీచర్లతో చర్చలు జరిపారు.
రోజుకొక వింత ధోరణి వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
న్యాయం చేయాలని మొరపెట్టు కుంటున్నా పట్టించుకోని వైనం
గురువారం మూడు గంటలకు పైగా ఆగిన కౌన్సెలింగ్ ప్రక్రియ
కౌన్సెలింగ్ కేంద్రంలో ధర్నా చేసిన బాధిత ఎస్జీటీ టీచర్లు
స్పౌజ్ సమస్యలే అధికం
ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్జీటీల కౌన్సిలింగ్ ప్రక్రియలో స్పౌజ్ సమస్య టీచర్లను నష్టపోయేలా చేస్తోంది. సీనియారిటీ నంబర్ 703కు ప్రక్రియ వచ్చేసరికి స్పౌజ్ సమస్యతో బాధిత మహిళా టీచర్ దీపిక న్యాయం చేయాలంటూ కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. మరికొందరు స్పౌజ్ బాధితులు ఆమెకు మద్దతు తెలిపారు. బాధిత టీచర్ దీపిక, ఆమె భర్త ఇద్దరూ ఎస్జీటీలే. ఆమె బుచ్చినాయుడుకండ్రిగలోను, ఆమె భర్త కేవీబీపురంలో పనిచేస్తున్నారు. వారు తప్పనిసరి బదిలీల్లో ఉన్నారు. బదిలీ జీవో ప్రకారం ఆమె ఉమ్మడి చిత్తూరులో ఎక్కడైనా కోరుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు కేవీబీపురం మండలంలోనే కోరుకోవాలంటూ ఆమైపె తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీంతో జీవో 22ను అమలుచేసి న్యాయం చేయాలని బాధిత టీచర్ పట్టుబట్టి మరికొంత మంది బాధిత టీచర్లతో ధర్నా చేపట్టింది. చివరికి డీఆర్వో మోహన్ కుమార్, పోలీసులు కౌన్సిలింగ్ కేంద్రంలోకి ప్రవేశించారు. బాధిత టీచర్లతో చర్చలు జరిపారు. జీవో ప్రకారం బాధిత టీచర్ దీపికకు శ్రీకాళహాస్తి కోరుకునేలా అవకాశం కల్పించారు. సమస్య పరిష్కారం అయ్యాక విద్యాశాఖ అధికారులు కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగించారు.

బలవంతపు బదిలీలు..!