
డయేరియా నివారణపై అవగాహన
చిత్తూరు రూరల్(కాణిపాకం): డయేరియా నివారణ కార్యక్రమ ఉద్దేశంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్ఓ సుధారాణి ఆదేశించారు. ఆమె గురువారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శిశుమరణాల నివారణే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలోని వైద్యబృందం ఇంటింటా సర్వే చేపట్టి 0–5 ఏళ్ల లోపు పిల్లలను గుర్తించాలన్నారు. ఈ సర్వేను ఈ నెల 16 నుంచి జూలై 31వ తేదీ వరకు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. డయేరియా నివారణకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐఓ హనుమంతరావు, డీఎంఓ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం వ్యాన్ బోల్తా
వడమాలపేట (విజయపురం): వడమాలపేట మండలం, తడుకు ఆర్ఎస్ కూడలి వద్ద మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తాపడింది. రేణిగుంట నుంచి మద్యం లోడుతో వడమాలపేట మీదుగా విజయపురం వెళ్తున్న సమయంలో తడుకు ఆర్ఎస్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్లోని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ ధర్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
గంగజాతరకు రానీయకుండా దాడులు
పలమనేరు: తమ గ్రామంలో బుధవారం జరిగిన గంగ జాతరలో భాగంగా ఆలయంలో జరిగే పూజలకు తమను రావద్దని గ్రామ పెద్దలు అభ్యతరం తెలిపారని, దీనిపై ప్రశ్నించగా తమపై దాడులు చేసి గాయపరిచారని గంగవరం మండలం, గుండుగల్లు దళితులు వాపోయారు. ఈ మేరకు వారు గురువారం స్థానిక డీఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలో జాతరను అన్ని కులాలు కలిసి చేసుకుందామని చెప్పి తీరా ఆలయంలోకి తమను ప్రవేశించకుండా అడ్డుకున్నారన్నారు. దీనిపై అడిగినందుకే దాడి చేశారని తెలిపారు. డీఎస్పీకి విన్నవించిన వారిలో ఆ గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, వెంకటరమణ, మునిరత్నం తదితరులున్నారు.

గంగజాతరకు రానీయకుండా దాడులు