
మద్దతు ధరతోనే మామిడిని కొనాలి
– పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశాలు
తవణంపల్లె : రాష్ట్ర ప్రభుత్వం తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను విధిగా రైతులకు అందించేలా గుజ్జు ఫ్యాక్టరీ యజమానులు పనిచేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఆదేశించారు. బుధవారం మండలంలోని జీసీఆర్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , ఎంఓఎఫ్పీఐ, ఫీల్ ఫ్రెష్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుజ్జు ఫ్యాక్టరీని, సిద్ధార్ధ, ఎఫ్3 గుజ్జు ఫ్యాక్టరీలను కలెక్టర్ తనిఖీ చేశారు. బంగారుపాళ్యం హార్టికల్చర్ అధికారి సాగరిక ఫ్యాక్టరీ యజమానులు ధరను నిర్ణయించడంలేదని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్కుమార్ మాట్లాడుతూ.. తోతాపురి రకానికి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను విధిగా అమలు చేయాలని ఫ్యాక్టరీ యజమానులకు దిశానిర్దేశం చేశారు. ఫ్యాక్టరీ యజమానులు మామిడికి మద్దతు ధరను అమలు చేసి రైతులు, అధికార యంత్రాంగానికి సహకరించాలన్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద విధులకు కేటాయించిన సిబ్బంది తోతాపురి మామిడి రైతుల పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్తో పాటు తవణంపల్లె తహసీల్దార్ సుధాకర్, అధికారులు పాల్గొన్నారు.