
సాక్షిని అణగదొక్కాలని కుట్ర
మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
చిత్తూరు కార్పొరేషన్ : ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాను అణగదొక్కాలని అధికార పార్టీ కుట్ర చేస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్టు కేఎన్ఆర్పై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు న్యాయమన్నారు. ఎక్కడైన షో నిర్వహించిన జర్నలిస్టును అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సాకుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారన్నారు.
మాజీ సీఎం భార్యపై సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ చేసిన పోస్టుల పై చర్య లేదన్నారు..? జగనన్న పాలనలో పార్టీలకతీతంగా పథకాలు అందించారన్నారు. అప్పుడు లబ్ధి పొందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు చేత వైఎస్సార్సీపీ వారి మీద కూటమి నాయకత్వం దాడుల చేయిస్తోందన్నారు. బాబు ఏడాది పాలనలో విచ్చలవిడిగా మద్యం ఎరులై పారుతోందన్నారు. టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా పక్క రాష్ట్రాలకు వెళుతోందన్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ మహిళపై చులకనగా మాట్లాడిన విషయం గుర్తు చేశారు. మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు.