
ఆగని గజరాజుల దాడులు
పెద్దపంజాణి: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు ఏనుగుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాపల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్, ఆకులవారిపల్లి, బేరుపల్లి, రాగిమాకులపల్లి, గౌదమాకులపల్లి, కమ్మపాళ్యం, గంకొండ, చీకలదిన్నేపల్లి తదితర గ్రామాలు అటవీ సరిహద్దులు కలిగి ఉన్నాయి. తరచూ ఏదో ఒక గ్రామంలో పంటలను ఏనుగులు నాశనం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకువచ్చింది. అయినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. తాజాగా ఆదివారం వేకువజామున పలమనేరు రేంజ్ కీలపట్ల ఫారెస్టు బీటు నుంచి వచ్చిన ఏనుగుల గుంపు తిప్పిరెడ్డిపల్లెకు చెందిన చంద్రారెడ్డి, అమరారెడ్డి, బాబు రెడ్డి తదితరుల మామిడి తోటలపై విరుచుకుపడ్డాయి. మామిడికొమ్మలను విరిచేసి సుమారు ఒక టన్ను కవర్లు కట్టిన బేనీషా, ఖాదర్, ఇమామ్పసంద్ మామడి కాయలను నెమరువేశాయి. ఈ దాడుల్లో దాదాపు రూ.50 వేల నష్టం జరిగినట్లు అంచనా. ఉదయం తోటలోకి వెళ్లిన రైతులు ఏనుగుల విధ్వంసాన్ని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధిత రైతులు వెంటనే జిల్లా అటవీశాఖ అధికారిణికి సమాచారం చేరవేశారు. స్పందించిన ఆమె క్షేత్రస్థాయి అధికారులను సంఘటనా స్థలానికి పంపించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను తన కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు.