
వెన్నుపోటు దినంకు వెళ్లొద్దని బెదిరింపులు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో బుధవారం వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వెన్నుపోటు దినంకు వెళ్లొద్దని టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నగరంలోని పలు డివిజన్లలో ప్రజలను కార్యక్రమానికి వెళితే పరిణామాలు వేరేలా ఉంటుందని భయబాంత్రులకు గురిచేశారు. ప్రధానంగా మహిళలు, యువకులను టార్గెట్ చేశారు. అలాగే గుడిపాల, చిత్తూరు రూరల్ మండలాల్లో కూడా బెదిరింపు దోరణిని అవలంబించారు. వెన్నుపోటు దినానికి వెళ్లే వారికి పథకాల్లో కోతలు పెడుతామని, రేషన్, పింఛన్ ఆపేస్తామని భయపెట్టారు.
నేడు, రేపు బాస్కెట్ బాల్ పోటీలు
చిత్తూరు కార్పొరేషన్ : బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి అండర్–23 చాంపియన్షిప్ పోటీలు బుధ, గురువారాల్లో నిర్వహించనున్నట్లు ఏపీ బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు చెంగల్రాయనాయుడు తెలిపారు. నగరంలో మంగళవారం వివరాలను విలేకరులకు తెలియజేశారు. చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈసారి చిత్తూరులో నిర్వహిస్తున్నారన్నారు. టోర్నీ విజేతలకు చిత్తూరులోనే శిబిరం ఏర్పాటు చేసి జాతీయ స్థాయి పోటీలకు శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం రాష్ట్ర జట్లు కేరళ రాష్ట్రం కొచ్చిలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటుందని వెల్లడించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి పాల్గొన్నారు.
రేపు మొక్కలు నాటే కార్యక్రమం
చిత్తూరు కార్పొరేషన్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ ప్రాంతంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా కలెక్టర్ సుమిత్కుమార్, డీఎఫ్ ఓ భరణి, ప్రజాప్రతినిధులు వస్తారని ఎఫ్ఆర్వోలు బాలకృష్ణారెడ్డి, థామస్ తెలిపారు. పెనుమూరు క్రాస్ వద్ద గల నీవానగర వనంలో 9.30 గంటలకు మొక్కలు నాటుతారన్నా రు. పలు అంశాల పై విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేస్తారని తెలిపారు. అనంతరం నగరంలోని పిల్లల పార్కు లో కలెక్టర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆట వస్తువులను ప్రారంభించి, మొక్కలను నాటనున్నట్లు వివరించారు.
ఐజీ పేరిట నకిలీ మెయిల్
చిత్తూరు అర్బన్ : రాష్ట్ర హోంగార్డు ఐజీ పేరిట నకిలీ మెయిల్ పంపిన ముబారక్ అనే వ్యక్తిపై చిత్తూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన ముబారక్ అనే వ్యక్తి తాను హోంగార్డుగా పని చేస్తున్నట్లు ఓ నకిలీ సర్టిఫికెట్ను తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నట్లు.. అతనికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి ఐజీ పేరిట ఓ మెయిల్ వచ్చింది. దీన్ని తనిఖీ చేసిన అధికారులు ఐజీ పేరిట వచ్చిన మెయిల్ నకిలీదని నిర్ధారించుకున్నారు. చిత్తూ రు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ దేవప్రసాద్ ఫిర్యా దు మేరకు ముబారక్ తదితరులపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట రమణ తెలిపారు. మూడు రోజుల పాటు హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరింపేట నగరపాలక పాఠశాలలో ప్రారంభించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీసీ మాట్లాడుతూ.. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల స్వయం మూల్యాంకన ప్రక్రియ, టీచర్ల హ్యాండ్బుక్స్, లీవ్ యాప్ అమలు విధానంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎస్సీఈఆర్టీ అబ్జర్వర్ నరసింహులు, డైట్ అబ్జర్వర్ మోహన్రెడ్డి, ఎంఈవోలు, కోర్స్ ఇంచార్జి, డీసీఈబీ సెక్రటరీ హేమాద్రి, హెచ్ఎంలు, ఎస్ఆర్పీ, డీఆర్పీలు పాల్గొన్నారు.