
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా ఆస్పత్రి సమస్యల వల
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో 400 పడకలు ఉన్నాయి. నిత్యం 1,200 వరకు ఓపీలు వస్తుంటాయి. అలాగే ఇన్ పేషెంట్లు 350 మంది ఉంటుంటారు. అత్యవసర సేవల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి 200 కేసుల వరకు ఓపీకి వస్తుంటాయి. అయితే ప్రభుత్వాస్పత్రిలో పలు సమస్యలు తలెత్తడంతో సరైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భర్తీలో నిర్లక్ష్యం
జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం డాక్టర్ల నుంచి సిబ్బంది వరకు పలు పోస్టులు ఖాళీలగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోస్టులు ఖాళీ అయితే వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు పోస్టుల భర్తీ...అయోమయంగా మారింది. ప్రధానంగా ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉంది. ఇద్దరు డాక్టర్లతోనే పోస్టుమార్టం చేయిస్తూ నెట్టుకొస్తున్నారు. ప్రతి నెలా 40 పైగా పోస్టుమార్టం కేసులు ఇక్కడకు వస్తుంటాయి. నలుగురు డాక్టర్లుంటే పోస్టుమార్టం సమస్య తీరుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోక్సో కేసు కౌన్సెలింగ్కు సంబంధించి ఒక గైనిక్ డాక్టర్ ఉండాలనే నిబంధన ఉంది. అలాగే హెడ్నర్సు పోస్టులు రెండు ఖాళీలున్నాయి. స్టాఫ్ నర్సులు 78 మందికి గాను 61 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులో కూడా కొంత మందిని అదనపు పనులకు కేటాయించారు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు 15 మంది అవసరమవుతోందని, జీడీఓలు 8 మంది ఉండాలని, ఫార్మాసిస్ట్లు 6 మంది దాకా అవసరమని ఆస్పత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది కొరత కారణంగా పనిభారం పెరుగుతోందని పలువురు సిబ్బంది వాపోతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సక్రమంగా సేవలు అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో అందని మందులు
జిల్లా ఆస్పత్రికి ముఖ్యంగా మందుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. సకాలంలో అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డ్రగ్స్ కేంద్రం నుంచే సరఫరా రావడం లేదని.ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కనీసం జ్వరం, దగ్గు, జలుబుకు సైతం మందులు లేకపోవడం గమనార్హం. దీంతో బయట మందులు కొనుగోలు చేసుకోవాలని రోగులను కోరాల్సి వస్తోందని, వారు తమపై మండిపడుతున్నారని వైద్య సిబ్బంది వాపోతున్నారు.
జిల్లా ప్రభుత్వాస్పత్రిని
చుట్టుముట్టిన సమస్యలు
భర్తీకి నోచుకోక ఖాళీగా పలు పోస్టులు
పోస్టుమార్టానికి సైతం లేని డాక్టర్లు
అందుబాటులో లేని మందులు
బడ్జెట్లో యథేచ్ఛగా కోతలు
నేడు జిల్లా ఆస్పత్రికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు రాక
నిధుల కొరత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లా ఆస్పత్రికి అవసరమైన మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించేంది. కూటమి వచ్చాక మందులు, మాత్రలు సరఫరా కాకపోగా ఆస్పత్రి నిధులు కూడా అరకొరగా కేటాయిస్తున్నారు. చాలీచాలని నిధులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
నేడు ఆస్పత్రి పరిశీలన
చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఆస్పత్రికి చేరుకుని పలు విభాగాలను పరిశీలించనున్నారు. రోగులు, ఆస్పత్రి అధికారులతో మాట్లాడనున్నారు. ఈతరుణంలో పై సమస్యలను తెలుసుకుని ఆస్పత్రి అభివృద్ధికి కృషికి చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.