
బెట్టింగ్ యాప్తో బురిడీ
● రాయలపేటలో బెట్టింగ్ ముఠా ! ● ఓ బాధితుడి ఫిర్యాదుతో మోసాలు వెలుగులోకి.. ● రెండు నెలల కిందట ఎఫ్ఐర్ వేసి 15 మంది కేసు ● వందల సంఖ్యలో బాధితులు
సాక్షి, టాస్క్ఫోర్స్ : ఎక్కడో పెద్ద నగరాల్లో క్రికెట్ యాప్ బెట్టింగులు చేసి మోసాలకు పాల్పడేవాళ్లను చూస్తుంటాం. కానీ పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజాణి మండలం రాయలపేట లాంటి గ్రామంలో ఓ సెల్షాప్ నిర్వహించే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ యాప్లో కోట్లు సంపాదించి వందల మందిని రోడ్డున పడేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇది నిజం.. బెట్టింగ్ మోసాలతో రూ.70 లక్షలు పోగొట్టుకున్న ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాయలపేట బెట్టింగ్ ముఠా గుట్టు మంగళవారం వెలుగు చూసింది.
సెల్ఫోన్ దుకాణం నడుపుకుంటూ...
రాయలపేటకు చెందిన చంద్రబాబు (36) మొబైల్ షాపు పెట్టుకొని చిన్నపాటి రిపేర్లు చేసుకోనేవాడు. క్రికెట్ బెట్టింగులపై ఆసక్తితో పలు ముఠాలతో సంబంధాలు పెట్టుకొన్నాడు. దీంతో తానే స్వయంగా రాధ.ఎక్కేంజ్ అనే ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగులు కొనసాగించడం మొదలు పెట్టాడు. ఇది మొబైల్లో ఎవరికీ కనిపించని డార్క్నెట్. ఇతని మోసాలకు ఈ మూడేళ్లలో వందల మంది బలైనట్లు తెలుస్తోంది. ఇలా సంపాదించిన కోట్ల రూపాయలతో సొంత గ్రామంలో విలాసవంతమైన భవంతులు అందులో ఫేస్లాక్ డోర్లు, ఎటుచూసిన ఆస్తులు, బెంగళూరులో అపార్ట్మెంట్లు, రూ.50 లక్షల కారు ఇలా జీవితాన్ని విలాసవంతం చేసుకున్నాడు. తనతోపాటు తన కుటుంబీకులు, బంధువులు, స్నేహతుల ఖాతాల ద్వారా సైతం భారీగా లావాదేవీలు జరిపాడు.
మోసపోయిన బాధితులు వందల సంఖ్యలో...
ఇతని ప్రైవేట్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగులకు పాల్పడిన బాధితులు వందలసంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో సాప్ట్వేర్లు, టీచర్లు, స్టూడెంట్లు, పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
● ఈ విషయమై గంగవరం రూరల్ సీఐ మురళీమోహన్ను వివరణ కోరగా రాయలపేటకు చెందిన చంద్రబాబుతో పాటు మరికొందరిపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాట నిజమేనన్నారు. ఈ కేసులో భాగంగా ప్రధాన నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నామని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదుతో...
నేలపల్లికి చెందిన ఓ యువకుడు ముఠా నిర్వాహకుడు చంద్రబాబు మాట నమ్మి క్రికెట్ బెట్టింగ్లో రూ.70 లక్షలు పోగొట్టుకున్నానని రెండు నెలల క్రితం పెద్ద పంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇరువురు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఈ పంచాయతీ ఇక్కడి ముఖ్యనేత వద్దకు చేరినట్లు సమాచారం. అది రాజీకాకపోవడంతో మళ్లీ పోలీసులు రంగ ప్రవేశం చేసి తాజాగా చంద్రబాబుతోపాటు మరో 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ముఠా గ్రామం నుంచి పరారైంది. ఇప్పుడు పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. దీంతో ఈ విషయం మంగళవారం బయటపడింది.