
7 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు
వడమాలపేట (విజయపురం) : వడమాలపేట మండల అప్పలాయిగుంటలో వెలసిన శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను జూన్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ జరిపించనున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులు విశిష్ట వాహనాల్లో విహరించనున్నట్లు చెప్పారు. 10వ తేదీ నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన దంపతులు రూ.500లు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ తప్పనిసరి
యాదమరి: మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ను రెండేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా వేయించాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి హనుమంతరావు తెలిపారు. సోమవారం ఆయన యాదమరి ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ చేశారు. హనుమంతరావు మాట్లాడుతూ టీకా వేసుకోని వారిని గుర్తించాలని, జూలైలోపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రత్యేక డ్రైవ్ వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్కుమార్ పాల్గొన్నారు.
వరసిద్ధుని సేవలో న్యాయమూర్తులు
కాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామిని సోమవారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందేష్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ సారిక వేర్వేరుగా సేవించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈఓ పెంచల కిషోర్ తీర్థప్రసాదాలతోపాటు స్వామివారి చిత్రపటం అందించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,538 మంది స్వామివారిని దర్శించుకోగా 37,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.