ఐరాల: ప్రజల నుంచి అందిన రెవెన్యూ సమస్యల అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వీఆర్వోలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ విద్యాధరి హెచ్చరించారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో, ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నివేదికలు సిద్ధం చేయాలని తహసీల్దార్ మహేష్కుమార్ను ఆదేశించారు. ప్రజలు ఎక్కువగా రెవెన్యూ సమస్యల పరిష్కారం నిమిత్తం కార్యాలయానికి వస్తుంటారని, సమస్యల నిమిత్తం వచ్చే ప్రజలతో సిబ్బంది సానుకూలంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణలో మొక్కల పెంపకం చేపట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.