విప్రో లాభం 28% జూమ్‌ | Wipro Q4 Profit Jumps 28 Percent Zoom | Sakshi
Sakshi News home page

విప్రో లాభం 28% జూమ్‌

Apr 16 2021 3:32 AM | Updated on Apr 16 2021 3:36 AM

Wipro Q4 Profit Jumps 28 Percent Zoom - Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం (2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4 (జనవరి-మార్చి)లో నికర లాభం 28 శాతం జంప్‌చేసి రూ.2,972 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,326 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 3.4 శాతం పుంజుకుని రూ. 16,245 కోట్లను అధిగమించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.15,711 కోట్ల టర్నోవర్‌ సాధించింది. డాలర్ల రూపేణా 215.24 కోట్ల డాలర్ల ఆదాయం నమోదైంది. ఇది 3.9 శాతం వృద్ధి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 11 శాతం ఎగసి రూ.10,796 కోట్లు దాటింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా 1.5 శాతం పెరిగి రూ. 61,943 కోట్లకు చేరింది.

మార్జిన్లు భేష్‌...: క్యూ4లో విప్రో ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్‌) 29.5 శాతం జంప్‌చేసి రూ. 3,417 కోట్లను తాకింది. ఈ బాటలో ఇబిట్‌ మార్జిన్లు 3.44 శాతం బలపడి 21 శాతానికి చేరాయి. వేతన పెంపు చేపట్టినప్పటికీ మార్జిన్లను మెరుగుపరచుకున్నట్లు విప్రో సీఎఫ్‌వో జతిన్‌ దలాల్‌ తెలియజేశారు. క్యూ4లో ఐటీ ప్రొడక్టుల ఆదాయం రూ. 210 కోట్లకు చేరగా, పూర్తి ఏడాదికి రూ. 770 కోట్లను తాకింది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)తొలి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లో 129.5–223.8 కోట్ల డాలర్ల ఆదాయాన్ని అం చనా వేస్తోంది. ఇది క్యూ4తో పోలిస్తే 2-4% వృది ్ధకాగా.. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11–13% అధికం! అయితే ఇటీవల కొనుగోలు చేసిన క్యాప్‌కో, యాంపియన్‌లను పరిగణనలోకి తీసుకోకుండా వేసిన అంచనాలుగా కంపెనీ తెలిపింది. 
వలసలు 12.1 శాతం...
ఇటీవల చేపట్టిన బైబ్యాక్‌ ద్వారా 1.3 బిలియన్‌ డాలర్లను వాటాదారులకు అందించినట్లు జతిన్‌ పేర్కొన్నారు. ఈ జనవరి 1కల్లా 80 శాతం మంది ఉద్యోగులకు వేతన పెంపు, ప్రమోషన్లు వంటివి చేపట్టినట్లు సీఈవో డెలాపోర్ట్‌ చెప్పారు. మార్చికల్లా విప్రో సిబ్బంది సంఖ్య 1,97,712కు చేరింది. ఉద్యోగ వలసల రేటు 12.1%గా నమోదైంది. మార్కెట్లు ముగిశాక విప్రో ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 434 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement