ఆగస్టులో సరికొత్త రికార్డులకు లావాదేవీలు
2,451 కోట్లకు చేరిక
న్యూఢిల్లీ: రాఖీ పండుగ దన్నుతో ఆగస్టులో యూపీఐ మాధ్యమం ద్వారా చెల్లింపు లావాదేవీలు సరికొత్త రికార్డులకు చేరాయి. గత నెలలో రూ. 29.8 లక్షల కోట్ల విలువ చేసే 2,451 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఆగస్టులో నమోదైన రూ. 24.85 లక్షల కోట్లతో పోలిస్తే విలువ దాదాపు 20 శాతం పెరిగింది. అలాగే, లావాదేవీల పరిమాణం 1,963 కోట్ల నుంచి దాదాపు 22 శాతం వృద్ధి చెందింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
విలువపరంగా మే, జూలైలో నమోదైన రూ. 29.9 లక్షల కోట్లకు దాదాపు చేరువలో ఆగస్టు గణాంకాలు ఉన్నాయి. పరిమాణంపరంగా జూలైలో లావాదేవీలు 2,366 కోట్లుగా, జూన్లో 2,272 కోట్లుగా, మే నెలలో 2,320 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్టులో రక్షా బంధన్ పండుగ సందర్భంగా బహుమతుల కింద చిన్న మొత్తాల చెల్లింపులు పెరగడమనేది, లావాదేవీల భారీ వృద్ధికి తోడ్పడినట్లు క్యాష్ఫ్రీ పేమెంట్స్ సహ వ్యవస్థాపకుడు రీజు దత్తా తెలిపారు.
క్రెడిట్ ఆన్ యూపీఐలాంటి ఆప్షన్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్లో ట్రాన్సాక్షన్స్ మరింతగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని నెట్వర్క్ పీపుల్ సరీ్వసెస్ టెక్నాలజీస్ (ఎన్పీఎస్టీ) సహ వ్యవస్థాపకుడు దీపక్ చంద్ ఠాకూర్ చెప్పారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా 2026 ఆగస్టు 25న ప్రవేశపెట్టిన ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) ప్రస్తుతం ఫ్రాన్స్, సింగపూర్ తదితర 11 దేశాలకు విస్తరించింది. 2016–17లో రూ. 70 వేలు విలువ చేసే 1.78 కోట్ల లావాదేవీలు నమోదు కాగా.. తాజాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 314 లక్షల కోట్ల విలువ చేసే 24,162 కోట్ల లావాదేవీలకు ఎగిశాయి.


