ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు | RBI Warns AI Cyber Threats Could Shake India Financial System | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్థలకు ఏఐ సైబర్ ముప్పు

Jul 3 2026 11:04 AM | Updated on Jul 3 2026 11:25 AM

RBI Warns AI Cyber Threats Could Shake India Financial System

దేశీయ ఆర్థిక వ్యవస్థలో సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, అంతే స్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన తాజా ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్’ (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ఐటీ, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలను నిరంతరం బలోపేతం చేసుకోవాలని తెలిపింది. రాబోయే 12 నెలల్లో ఏఐ ఆధారిత సైబర్ దాడులే ఆర్థిక రంగానికి అతిపెద్ద సవాలుగా మారనున్నాయని ఆర్‌బీఐ ఈ నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది.

ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం

ప్రపంచవ్యాప్తంగా ఇతర ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంపైనే అత్యధిక సంఖ్యలో సైబర్ దాడులు జరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ తర్వాత అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ఆర్థిక సంస్థల్లో 42 శాతం సంస్థలు భౌగోళిక అనిశ్చితి కారణంగానే సైబర్ దాడుల ముప్పు తీవ్రతరమైందని అంగీకరించాయి.

ఆర్థిక స్థిరత్వానికి విఘాతం

‘డిజిటల్ పరిజ్ఞానంతో ముడిపడి ఉన్న ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఒక్క సైబర్ దాడి జరిగినా అది మొత్తం వ్యవస్థను కుదిపేస్తుంది. సేవల నిలిపివేత, డేటా చోరీ, పేమెంట్ వ్యవస్థల్లో అంతరాయాల వల్ల ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకం సడలిపోతుంది’ అని ఆర్‌బీఐ హెచ్చరించింది.

ఏఐ సవాళ్లు - సన్నద్ధతలో వెనుకబాటు

2020 నుంచి డిజిటల్ ఆర్థిక సేవల వినియోగం విపరీతంగా పెరగడంతో సైబర్ నేరగాళ్లకు మరిన్ని అవకాశాలు చిక్కాయని నివేదిక తెలిపింది. దేశంలోని 33 షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, 10 అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీల ఆధారంగా ఆర్‌బీఐ ఈ సర్వే నిర్వహించింది. ఏఐ సాంకేతికత వేగంగా విస్తరిస్తుండటంతో సైబర్ దాడుల తీవ్రత, వేగం, పరిధి ఊహించని స్థాయికి చేరాయని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు మన ఆర్థిక సంస్థల సన్నద్ధత ఇంకా ప్రాథమిక దశల్లోనే ఉందని సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

  • మెజారిటీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ ఏఐ రక్షణ వ్యవస్థల్లో ఇంకా అభివృద్ధి చెందుతున్న లేదా మధ్యస్థ దశలోనే ఉన్నాయి.

  • ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనేలా పూర్తిస్థాయి సన్నద్ధత సాధించిన సంస్థల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

  • ఈ నేపథ్యంలో ప్రస్తుత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తూ.. నిరంతర నిఘా, ఉద్యోగుల్లో అవగాహన, తక్షణ స్పందన వంటి చర్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాలని ఆర్‌బీఐ సూచించింది.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement