కస్టమర్ల వేధింపులకు చెక్
కాల్స్ రికార్డ్ చేయాలి
రుణగ్రహీతలతో మర్యాదగా వ్యవహరించాలి
రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ గైడ్లైన్స్
ముంబై: రికవరీ ఏజెంట్ల ఆగడాలకు కళ్లెం దిశగా రిజర్వ్ బ్యాంక్ గురువారం కొన్ని ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం లోన్ రికవరీ బాధ్యతలు నిర్వర్తించే ఏజెంట్లు తప్పనిసరిగా దానికి సంబంధించిన శిక్షణ పొందాలి. బ్యాంకు ఉద్యోగి లేదా రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతతో గౌరవప్రదంగా మాట్లాడాలి. వసూలు కోసం వెళ్లినప్పుడు కూడా మర్యాదకరంగా వ్యవహరించాలి. రుణగ్రహీతలకు ఏజెంట్లు చేసే ఫోన్ కాల్స్ అన్నీ కూడా తప్పకుండా రికార్డ్ అయ్యేలా బ్యాంక్ చర్యలు తీసుకోవాలి.
ఏజెంట్లు లేదా ఉద్యోగుల దగ్గరున్న కస్టమర్ల వివరాలు దురి్వనియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రికవరీ ప్రయత్నాల్లో భాగంగా ఏజెంట్లు దుర్భాషలాడటం, అనుచిత మెసేజీలు పంపించడంలాంటివి చేయకూడదు. రుణ గ్రహీత కుటుంబం దుఃఖంలో ఉన్న పరిస్థితుల్లో, వివాహ వేడుకలు, పండుగల్లాంటి సందర్భాల్లో లోన్ రికవరీ ప్రయత్నాలు చేయకూడదు.
రికవరీ ఏజెంట్లుగా వ్యవహరించే వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఐఐబీఎఫ్) నిర్వహించే ’డెట్ రికవరీ ట్రైనింగ్’ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తోంది. రికవరీ ఏజెన్సీలు తాము నియమించుకునే ఏజెంట్ల పూర్వచరిత్ర గురించి కూడా తెలుసుకునేలా బ్యాంకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ రుణ బాకీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉంటే ఆ వ్యవహారాన్ని ఉద్యోగులకు లేదా రికవరీ ఏజెంట్లకు రిఫర్ చేసే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానిటరీ పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రికవరీలపై నిర్దిష్ట ప్రకటన చేసిన మీదట రిజర్వ్ బ్యాంక్ తాజా ముసాయిదా నిబంధనలను ప్రతిపాదించడం గమనార్హం.


