ముంబై: విదేశాల నుంచి భారత్లోని ఖాతాలకు వచ్చే సీమాంతర చెల్లింపులపై (జమలు) ఖాతాదారులకు వెంటనే సమాచారం (నోటిఫికేషన్) ఇవ్వాలని బ్యాంక్లకు ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా తమ ప్రక్రియలను క్రమబద్దీకరించుకోవాలని సూచించింది. ఖాతాలో జమ అయిన వెంటనే కస్టమర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఫారెక్స్ మార్కెట్ పనిచేయని వేళ్లలో వచ్చే చెల్లింపుల విషయాన్ని మరుసటి రోజు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు తమ విదేశీ ఖాతాల లావాదేవీలను గరిష్టంగా ఒక గంటలోపే పరిశీలించి సరిచూడాలని ఆదేశించింది. ఫారీన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ పనివేళ్లలో వచ్చే చెల్లింపులను మాత్రం అదే రోజు జమ చేయాలని పేర్కొంది. ఇందుకు వీలుగా వ్యవస్థలను సరిచేసుకోవాలని సూచించింది.
2025 అక్టోబర్ 29న జారీ చేసిన ముసాయిదా నిబంధనలపై భాగస్వాముల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నిబంధనలను ఆర్బీఐ జారీ చేసింది. ఇవి ఆరు నెలల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం సీమాంతర చెల్లింపులకు సంబంధించి సమాచారం అందించిన వెంటనే, ఆ మొత్తాన్ని తక్షణమే సంబంధిత లబ్దిదారు ఖాతాలో జమ చేయనప్పటికీ, కస్టమర్లకు వెంటనే ఆ విషయాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.


