హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా సూపర్మార్కెట్ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. వీటి ప్రకారం తాజాగా రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్లు 1.49 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
సందీప్ అగర్వాల్, మనీష్ భర్తియా, మితేష్ భర్తియా వీరిలో ఉన్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 260 కోట్లను రత్నదీప్, నేషనల్ మార్ట్ ఫార్మాట్ల కింద కొత్త స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది. రూ. 80 కోట్ల మేర ప్రీ–ఐపీవో చేపట్టే అవకాశం కూడా పరిశీలనలో ఉన్నట్లు రత్నదీప్ తెలిపింది. సంస్థకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో స్టోర్స్ ఉన్నాయి. 2026 మార్చి 31 నాటికి రత్నదీప్ సెలెక్ట్, నేషనల్ మార్ట్ ఫార్మాట్ల కింద 190 స్టోర్స్ ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,273 కోట్ల ఆదాయం, రూ. 37 కోట్ల లాభం నమోదు చేసింది.


