పేపర్‌ పరిశ్రమ ఆదాయంలో క్షీణత | Paper industry revenue may dip 8-10 per cent in FY24 | Sakshi
Sakshi News home page

పేపర్‌ పరిశ్రమ ఆదాయంలో క్షీణత

Sep 15 2023 1:00 AM | Updated on Sep 15 2023 1:00 AM

Paper industry revenue may dip 8-10 per cent in FY24 - Sakshi

న్యూఢిల్లీ: అమ్మకాలు పెరిగినప్పటికీ పేపర్‌ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 8–10 శాతం మేర క్షీణించొచ్చని ప్రమఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. తీవ్ర పోటీ కారణంగా నికర ప్రయోజనం తగ్గొచ్చని పేర్కొంది. క్రితం ఏడాది మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద అమ్మకాల పరిమాణం 5–7 శాతం మేర పెరుగుతుందని అంచనా వేసింది. నిర్వహణ మార్జిన్‌ ఆరోగ్యకరంగా 18–19 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే అయినా, కరోనా ముందున్న నాటి 17 శాతం కంటే ఎక్కువేనని వివరించింది. దీంతో స్థిరమైన నగదు ప్రవాహాలు ఉంటాయని తెలిపింది.

2022–23లో పేపర్‌ పరిశ్రమ రికార్డు స్థాయిలో 30 శాతం ఆదాయ వృద్ధిని చూడడం గమనార్హం. 87 పేపర్‌ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్‌ ఈ నివేదికను విడుదల చేసింది. పేపర్‌ పరిశ్రమలో సగం ఆదాయం ఈ కంపెనీల చేతుల్లోనే ఉంది. ప్యాకేజింగ్‌ పేపర్‌ వాటా మొత్తం మార్కెట్‌లో 55 శాతంగా ఉంది. ఆ తర్వాత రైటింగ్, ప్రింటింగ్‌ (డబ్ల్యూపీ) పేపర్‌ వాటా 30 శాతంగా ఉంది. మిగిలినది న్యూస్‌ ప్రింట్, స్పెషాలిటీ పేపర్‌. ప్యాకేజింగ్‌ పేపర్‌ను ఫార్మాస్యూటికల్స్, ఈ కామర్స్‌ గూడ్స్, కన్జన్యూమర్‌ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎంసీజీ, రెడీమేడ్‌ విభాగాలు ఉపయోగిస్తుంటాయి. విద్యా రంగం, కార్పొరేట్‌ రంగం డబ్ల్యూపీ పేపర్‌ను ఉపయోగిస్తుంటుంది.

డిమాండ్‌ ఇలా..  
ప్యాకేజింగ్‌ పేపర్‌ అమ్మకాల పరిమాణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6–8 శాతం మేర పెరగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ నుంచి డిమాండ్‌ ఇందుకు మద్దతుగా నిలుస్తుందని పేర్కొంది. డబ్ల్యూపీ పేపర్‌ అమ్మకాల పరిమాణం 3–5 శాతమేర పెరుగుతుందని అంచనా వేసింది. ప్రభుత్వం వ్యయాలకు తోడు, నూతన వి ద్యా విధానం ఇందుకు అనుకూలిస్తుందని తెలిపింది. అలాగే, 2024 సాధారణ ఎన్నికల ముందు డబ్ల్యూపీ పేపర్‌కు డిమాండ్‌ పెరుగుతుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement