ఎల్‌ఐసీ.. ఆదాయం అదరహో

LIC profit rises multifold to rs 15,952 cr in q2 - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 11 రెట్లు దూసుకెళ్లి రూ. 15,952 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 1,434 కోట్లు ఆర్జించింది. ఇందుకు భారీగా పెరిగిన పెట్టుబడుల విక్రయ లాభాలు దోహదం చేశాయి. 

ఈ కాలంలో మొత్తం ప్రీమియం ఆదాయం 27 శాతం పురోగమించి రూ. 1,32,632 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,04,914 కోట్లు మాత్రమే నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 18,72,044 కోట్ల నుంచి రూ. 22,29,489 కోట్లకు జంప్‌చేసింది. వ్యాపార వృద్ధిని ప్రతిఫలించే తొలి ఏడాది ప్రీమియం రూ. 8,198 కోట్ల నుంచి రూ. 9,125 కోట్లకు బలపడింది. రెన్యువల్‌ ప్రీమియం స్వల్ప వృద్ధితో రూ. 56,156 కోట్లకు చేరగా.. సింగిల్‌ ప్రీమియం 62 శాతం అధికమై రూ. 66,901 కోట్లను తాకింది.ఫలితాల నేపథ్యంలో ఎల్‌ఐసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 627 వద్ద ముగిసింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top