భారత ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తున్న మంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్ రూపకల్పన వెనుక ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, వృద్ధిని సమతుల్యం చేస్తూ ఒక శక్తివంతమైన అధికారుల బృందం గత కొన్ని నెలలుగా శ్రమించింది.
బడ్జెట్ వెనుక ఉన్న వ్యక్తులు
నిర్మలా సీతారామన్ (కేంద్ర ఆర్థిక మంత్రి): బడ్జెట్ రూపకల్పనకు దిశానిర్దేశం చేస్తూ భారత ఆర్థిక విధానాలను ప్రపంచ వేదికపై శక్తివంతంగా నిలుపుతున్న నాయకురాలు.
అనురాధ్ ఠాకూర్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి): బడ్జెట్ తయారీలో ఈమె అత్యంత కీలక పాత్ర పోషించారు. వనరుల కేటాయింపు, వృద్ధి ప్రాధాన్యతలు, బడ్జెట్ పత్రాల తుది రూపకల్పనలో ఈమెది ప్రధాన నిర్ణయం.
ఆర్వింద్ శ్రీవాస్తవ (రెవెన్యూ కార్యదర్శి): బడ్జెట్లోని పన్నుల ప్రతిపాదనల బాధ్యతను ఈయన పర్యవేక్షించారు. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాల మార్పులపై కీలకంగా వ్యవహరించారు.
ఉమ్లున్మాంగ్ ఉల్నమ్ (వ్యయ కార్యదర్శి): ప్రభుత్వ ఖర్చులు, వివిధ పథకాలకు సబ్సిడీల కేటాయింపులను సమన్వయం చేస్తూ నిధుల దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించారు.
ఎం.నాగరాజు (ఆర్థిక సేవల కార్యదర్శి): బ్యాంకింగ్ రంగం బలోపేతం, బీమా, పెన్షన్ వ్యవస్థల వృద్ధిపై దృష్టి సారించారు.
అరునిష్ చావ్లా (దీపమ్ కార్యదర్శి): ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పన్నేతర ఆదాయాన్ని సమకూర్చే బాధ్యతను నిర్వహించారు.
కె.మోసెస్ చాలై (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి): కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు, వాటి మూలధన వ్యయాన్ని పర్యవేక్షించారు.
వి.అనంత నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు): అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను విశ్లేషిస్తూ దేశీయ వృద్ధి రేటు అంచనాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రధాన లక్ష్యాలు.. వ్యూహాలు
ఈ బడ్జెట్ ప్రధానంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక లోటు నియంత్రణ మధ్య సమతుల్యతను సాధించడంపై దృష్టి సారించనుందని అంచనాలున్నాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన, ఉత్పాదక రంగం వృద్ధి, భారీ స్థాయిలో ఉద్యోగ సృష్టికి ఈ బడ్జెట్ పెద్దపీట వేస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


