సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘ఐసాల్వ్డ్’ హైదరాబాద్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్డ్ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.
కంపెనీ ప్రధాన సాఫ్ట్వేర్ ఉత్పత్తి ‘పీపుల్స్ క్లౌడ్’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్ బెనిఫిట్స్’, ‘మార్కెట్ప్లేస్’ల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్ మేనేజర్ యోగేశ్ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్ఆర్ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్డ్ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్తో వృద్ధి చెందుతోందని తెలిపారు.
అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వల్లభి ‘ఐసాల్వ్డ్’ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రగ్యా గుప్తా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అఈమ మోషేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్డ్లో 65 శాతం జెండర్ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్డ్ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.
హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్ను గ్లోబల్ కేపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్డ్ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా!


